తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన పన్నెండేళ్ల తర్వాత మరోసారి సెంటిమెంట్ రాజకీయాలు భగ్గుమన్నాయి. అప్పట్లో స్వపరిపాలన, నీళ్లు, నిధులు, నియామాకాల కోసం తెలంగాణ సెంటిమెంట్.. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఊపిరిగా నిలిచింది. ఇప్పుడు మాత్రం కొందరి రాజకీయ ప్రయోజనాల కోసమే సెంటిమెంట్ని రెచ్చగొడుతున్నట్టు కనిపిస్తోంది.
ఈ మధ్య కాలంలో జరిగిన రెండు సంఘటనలను గమనిస్తే.. తెలంగాణవాదం పేరుతో చేస్తున్న పాలిటిక్స్లో ఎలాంటి పక్షపాతం చూపిస్తున్నారు.. ఎవరిని టార్గెట్ చేసి.. ఇంకెవరి అక్రమాలను చూసీ చూడనట్లు వదిలేస్తున్నారో అర్ధమవుతుంది.
ప్రపంచ మేధావి, ప్రముఖ ఎనలిస్టు, యూట్యూబర్ అయిన ప్రొఫెసర్ నాగేశ్వర్.. ఒక అబద్దాన్ని నిజమని నమ్మించే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయారు. పవన్ కళ్యాణ్, అమిత్షా సమావేశం గురించి ఆయన చెప్పిన స్టోరీ కట్టుకథ అని తేలడంతో.. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు.
కానీ ఎక్కడి నుంచి వచ్చారో, ఎవరి ఆదేశాలతో దిగారో గానీ.. కొంత మంది తెలంగాణ వాదం పేరుతో పవన్ కళ్యాణ్ని బూతులు తిట్టడం ప్రారంభించారు. ప్రొఫెసర్గారు చెప్పింది నిజం కాదని క్లారిటీ ఇవ్వడమే తప్పయినట్లు.. తెలంగాణ మీద దాడి చేస్తున్నారని రెచ్చిపోయారు.
ఆంధ్రా పాలిటిక్స్లో వేలు పెట్టి.. ఏపీ మీద దాడి చేసింది ప్రొఫెసర్గారు. కానీ రివర్స్లో పవన్ కళ్యాణ్ని తెలంగాణ వ్యతిరేకిగా చూపించే ప్రయత్నాలు జరిగాయి. ఈ వ్యవహారంలో మాట్లాడిన వ్యక్తులు, రాజకీయ నాయకుల గురించి తెలిసిన వాళ్లంతా.. దీని వెనుక వైసీపీ, బీఆర్ఎస్ నాయకత్వాలు.. వారి సోషల్ మీడియా గ్రూపులు ఉన్నాయని తేల్చేశారు.
ఇదే సమయంలో మరో బ్రేకింగ్ న్యూస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఆంధ్రప్రదేశ్లోని వినుకొండ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడు.. హైదరాబాద్లో అత్యంత విలువైన పదెకరాల భూమిని కబ్జా చేసే ప్రయత్నంలో అడ్డంగా దొరికిపోయారు. కొంత మంది స్థానికులతో కలిసి ఏకంగా నకిలీ జీవోలు, ఫేక్ వెబ్సైట్లు క్రియేట్ చేసి.. 1500 కోట్ల రూపాయల విలువైన భూమిని కొట్టేయాలని చూశారు.
ఈ భాగోతం స్థానిక తహశీల్దారు దృష్టికి రావడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసుల.. కబ్జా కథలో బ్రహ్మనాయుడు కీలక సూత్రధారి అని తేల్చి ఆయన మీద కేసు నమోదు చేశారు. ప్రత్యేక బృందాలతో గాలించి తమిళనాడులోని కాంచీపురంలో బ్రహ్మనాయుడిని అరెస్టు చేశారు.
ఎగిరెగిరి పడ్డవారు ఇప్పుడు ఎక్కడున్నారు?
ఏపీకి చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. తెలంగాణలో 1500 కోట్ల భూమిని కొట్టేయాలని చూసినా.. తెలంగాణవాదం పేరుతో పవన్ కళ్యాణ్ మీద అంతెత్తున ఎగిరిన వాళ్లలో ఒక్కరు కూడా స్పందించలేదు. తెలంగాణలో ఆంధ్రోళ్ల దోపిడీ ఏంటి అని నిలదీసిన వాళ్లు లేరు.
అంటే ఈ నయా తెలంగాణ వాదానికి మెయిన్ స్పాన్సర్ ఆంధ్రాకి చెందిన జగన్రెడ్డి.. ఆయన సారధ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని స్పష్టమవుతోంది. ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. బ్రహ్మనాయుడి కబ్జా స్టోరీని కవర్ చేయడానికి పవన్ కళ్యాణ్ ఎప్పుడో దశాబ్దాల క్రితం లీగల్గా కొనుకున్న ఫామ్హౌస్… చెరువు శిఖంలో ఉందని ఫేక్ ప్రచారాలు ప్రారంభించారు.
సోషల్ మీడియాలో పవన్ ఫామ్హౌస్ గురించి అంత రచ్చ చేసిన వాళ్లు.. బ్రహ్మనాయుడు అరెస్టుపై నోరెత్తలేదు. ఇదంతా చూసిన తర్వాత.. కొంతమంది తెలంగాణవాదాన్ని తమ స్వార్ధ ప్రయోజనాల కోసం వాడుకొంటున్నారని అసలైన ఉద్యమకారులు, తెలంగాణవాదులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
