వైసీపీ విధానాలేంటో ఇప్పటికీ ప్రజలకు అర్థం కావడం లేదు. ఒకవైపు అమరావతికి అనుకూలమంటూనే, మరోవైపు మళ్లీ విషం ప్రచారం మొదలుపెట్టారు. అమరావతి విషయంలో ఆ పార్టీ నేతలు తమ అసలు బుద్ధిని బయటపెట్టుకుంటున్నారు.
కూటమి ప్రభుత్వం అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ, అభివృద్ధి పనుల్లో వేగం పెంచుతుంటే.. వైసీపీ నేతలు మాత్రం మళ్లీ విద్వేష ప్రసంగాలు మొదలుపెట్టారు. శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే..అమరావతిపై వైసీపీ చేస్తున్న కుట్రలు స్పష్టంగా అర్థమవుతాయి.
మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ, రాజధానిగా అమరావతి చట్టబద్ధత కోసం చేసిన తీర్మానం పనికిరాదంటూ బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు. రాజధాని అనేది రాష్ట్రాల ఇష్టమంటూ, భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వం రాజధానిని మార్చేస్తుందని మళ్లీ బెదిరింపులకు దిగారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అయితే ఏకంగా అమరావతిలో సంపద కేంద్రీకరించే వ్యక్తుల్ని కాల్చేయాలంటూ ఉన్మాదపూరిత కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఉత్తరాంధ్ర అభివృద్ధి ముసుగులో అమరావతిపై బురదజల్లడం వైసీపీకి అలవాటుగా మారింది. గతంలో హైదరాబాద్ ఉదాహరణ చెబుతూ ధర్మాన ప్రసాదరావు గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారు. రాజధానిలో లక్షల కోట్లు ఖర్చు పెడితే మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్న వీరు, ఐదేళ్ల తమ పాలనలో ఉత్తరాంధ్రకు లేదా రాష్ట్రానికి ఒక్క పరిశ్రమనైనా తెచ్చారా అని ప్రజలు నిలదీస్తున్నారు. ప్రజల మధ్య లేనిపోని అనుమానాలను రేకెత్తించి, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడమే ధ్యేయంగా ఫ్యాన్ పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారు.
విశాఖను రాజధాని చేస్తామంటూ గతంలో జగన్ మోహన్ రెడ్డి ఎంత హడావుడి చేసినా, ఉత్తరాంధ్ర ప్రజలు వైసీపీని చిత్తుగా ఓడించి బుద్ధి చెప్పారు. స్వయంగా ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు వంటి సీనియర్ నేతలను ఎన్నికల్లో మట్టికరిపించారు. ఉత్తరాంధ్ర ప్రజల అభిప్రాయాలను గౌరవించకుండా, మళ్లీ అదే రాజధాని మార్పు మాటలతో ప్రజలను మభ్యపెట్టాలని చూడటం వారి రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం. కూటమి ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తు కోసం కష్టపడుతుంటే, వైసీపీ నేతలు మాత్రం ఇప్పటికీ విధ్వంసకర ఆలోచనలతోనే కాలం గడుపుతున్నారు.
