న్యాయమూర్తిగా పని చేస్తూ కూడా అక్రమ నగదును భారీ ఎత్తున పోగేసుకున్న యశ్వంత్ వర్మ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. న్యాయమూర్తిగా పని చేసిన యశ్వంత్ వర్మ ఢిల్లీ నివాసంలో భారీగా అక్రమ నగదు లభించిన వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ఆయన తన న్యాయమూర్తి పదవికి రాజీనామా చేశారు. ఈ నిర్ణయంతో గత ఏడాది నుంచి కొనసాగుతున్న వివాదానికి ముగింపు పలికినట్టైంది.
ఈ వివాదం 2025 మార్చి 14న ప్రారంభమైంది. అప్పట్లో ఢిల్లీలో న్యాయమూర్తిగా ఉన్న యశ్వంత్ వర్మ ఢిల్లీ అధికారిక నివాసంలో భారీగా లెక్కల్లో లేని నగదు బయటపడింది. ఈ ఘటన న్యాయవ్యవస్థలో పారదర్శకత, బాధ్యతలపై దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.
ఈ పరిణామాలపై స్పందించిన అప్పటి ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా 2025 మార్చి 22న ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించింది. విచారణ కొనసాగుతున్న సమయంలో యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు.
ఇక మరోవైపు రాజకీయంగానూ ఈ వ్యవహారం వేడెక్కింది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, జడ్జెస్ ఇన్క్వైరీ యాక్ట్, 1968 ప్రకారం వర్మను పదవి నుంచి తొలగించేందుకు వచ్చిన ప్రతిపాదనను ఆమోదించి, మరో మూడు సభ్యుల కమిటీని నియమించారు. దీంతో పార్లమెంట్లో ఇంపీచ్మెంట్ ప్రక్రియ ప్రారంభమయ్యే పరిస్థితి ఏర్పడింది.
ఈ చర్యలను సవాల్ చేస్తూ యశ్వంత్ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టు ఆయన పిటిషన్ను తిరస్కరించి, పార్లమెంట్ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ నేపథ్యంలో అన్ని మార్గాలు మూసుకుపోయిన పరిస్థితిలో, పార్లమెంట్లో తొలగింపు ప్రక్రియను ఎదుర్కోవడం తప్పదని భావించిన యశ్వంత్ వర్మ చివరకు రాజీనామా చేయడం ద్వారా ఆ ప్రక్రియను తప్పించుకున్నారు. ఈ ఘటన భారత న్యాయవ్యవస్థలో బాధ్యత, పారదర్శకత, నైతిక విలువలపై మరోసారి పెద్ద చర్చకు కారణమైంది.
