TTD కల్తీ నెయ్యి వ్యవహారంలో అప్పటి TTD ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి పాత్రను నిర్ధారించేందుకు రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. 2018 తర్వాత చిన్నప్పన్నతో తనకు ఎలాంటి సంబంధం లేదని సుబ్బారెడ్డి బుకాయిస్తున్నప్పటికీ, 2023, 2024 సంవత్సరాల్లో కూడా సుబ్బారెడ్డి వెంటే చిన్నప్పన్న నీడలా ఉన్న ఫొటోలు ఇప్పుడు బయటకు వచ్చాయి.
విశాఖపట్నంలో జరిగిన పార్టీ కార్యక్రమాలు, విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం లాంటి సందర్భాల్లో సుబ్బారెడ్డి కుటుంబ సభ్యుల పక్కనే చిన్నప్పన్న ఉండటం చూస్తుంటే..వారి మధ్య ఉన్నది కేవలం వృత్తిపరమైన సంబంధం కాదు, అంతకు మించిన అనుబంధం ఉందని స్పష్టంగా అర్థమవుతోంది.
సిట్ దర్యాప్తులో తేలిన వివరాల ప్రకారం, ఈ లంచాల పర్వం అంతా సుబ్బారెడ్డి కనుసన్నల్లోనే జరిగినట్లు బలమైన ఆధారాలు లభిస్తున్నాయి. 2022 మే నెలలో భోలేబాబా డెయిరీ ప్రతినిధిని చిన్నప్పన్న ఢిల్లీకి పిలిపించి కిలోకు రూ. 25 చొప్పున లంచం డిమాండ్ చేయగా, అతను నేరుగా సుబ్బారెడ్డికి ఫిర్యాదు చేశారు.
అంటే, లంచం అడిగిన సమయంలో చిన్నప్పన్న సుబ్బారెడ్డి దగ్గరే PAగా కొనసాగుతున్నారనేది జగమెరిగిన సత్యం. అలాగే ప్రీమియర్ అగ్రిఫుడ్స్ నుంచి హవాలా మార్గంలో రూ. 50 లక్షలు వసూలు చేసినప్పుడు కూడా వారిద్దరి మధ్య నిరంతరం ఫోన్ కాల్స్, వాట్సప్ చాటింగ్ నడిచినట్లు సిట్ దర్యాప్తులో తేలింది.
సుబ్బారెడ్డి ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఫొటోలు మాత్రం పచ్చి నిజాలను బయటపెడుతున్నాయి. 2023 మార్చిలో విశాఖలో జరిగిన సన్మాన కార్యక్రమం నుంచి, 2024 మేలో ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత జరిగిన భేటీ వరకు..చిన్నప్పన్న ప్రతి చోటా సుబ్బారెడ్డి వెంటే ఉన్నారు.
సుబ్బారెడ్డి రాజ్యసభకు ఎన్నికైన సమయంలో ఆయన సతీమణి స్వర్ణలత వెంట విజయవాడ ఆలయంలో చిన్నప్పన్న ఉన్న దృశ్యాలు,చిన్నప్పన్న సుబ్బారెడ్డి కుటుంబంలో సభ్యుడిగా మెలిగారని నిరూపిస్తున్నాయి. ఇంతటి బలమైన ఆధారాలు ఉన్నా.. చిన్నప్పన్న ఎవరో తనకు తెలియదని సుబ్బారెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా మారింది.
చిన్నప్పన్నను పావుగా వాడుకుని, టీటీడీ కాంట్రాక్టుల ద్వారా కోట్ల రూపాయల అవినీతికి తెరలేపినట్లు స్పష్టమవుతోంది. ఇప్పుడు ఈ కేసు తీవ్రరూపం దాల్చుతుండడంతో చిన్నప్పను ఇరికించి తాను క్లీన్ చిట్ పొందాలని సుబ్బారెడ్డి ప్లాన్గా తెలుస్తోంది.
కానీ, లంచాల డిమాండ్ జరిగిన ప్రదేశాలు, సమయం మరియు అప్పుడు ఆయనతో ఉన్న అనుబంధం అన్నీ సుబ్బారెడ్డి చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. ఈ క్రమంలో, కల్తీ నెయ్యి పాపంలో అసలు సూత్రధారులు బయటపడటం ఖాయమని, ఈ ఫొటో సాక్ష్యాలే సుబ్బారెడ్డిని ఇరుకున పెడతాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
