ప్లాన్ బీ అంటే.. మొదటి ప్లాన్ కంటే అన్ని విధాలా మెరుగ్గా ఉండాలి. ఇదేం ప్లాన్ రా అని అనుకొనేలా ఉండకూడదు. మూడు రాజధానులకు ప్రత్యమ్నాయంగా వైసీపీ అధినేత ప్రతిపాదించిన మావిగన్.. ఇదేందయ్యా ఇది అనుకొనేలా ఉంది. ఈ మాట ప్రత్యర్ధులు చెప్పడం లేదు.. వైసీపీ వీరాభిమానులు కూడా ఇదేందన్నా ఇది అంటున్నారు. ఒకప్పుడు జగన్ మాటే శాసనం అనుకొనే వాళ్లంతా.. నువ్వు కొంతకాలం మాట్లాడకుండా ఉంటేనే ఉత్తమం అని ఉచిత సలహాలు ఇస్తున్నారు.
రాజకీయంగా చూసుకున్నా.. మావిగన్ వైసీపీని భూస్థాపితం చేసేలా ఉంది. గతంలో మూడు రాజధానుల ప్లాన్లో చిత్తశుద్ధి, నిజాయితీ లేకపోయినా.. తెలివైన పొలిటికల్ రీజనింగ్ ఉంది. విశాఖలో పరిపాలన రాజధానితో ఉత్తరాంధ్రను.. కర్నూల్లో న్యాయ రాజధానితో రాయలసీమను అభివృద్ధి చేస్తామని చెప్పుకొన్నారు.
ఈ కారణంతోనే.. అమరావతిని వ్యతిరేకించాలని డిసైడ్ అయితే.. పాత మూడు ముక్కలాటకు కట్టుబడి ఉండాల్సిదని జగన్ శ్రేయోభిలాషులే చెబుతున్నారు. ప్రాంతీయ వాదంతో త్రీ కేపిటల్స్ను సమర్దించుకొనే ఛాన్స్ ఉండేది. కానీ మావిగన్ పేరుతో ఇటు అమరావతికి వ్యతిరకం అనే ముద్ర వేయించుకోవడంతో పాటు.. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలను జగన్ విస్మరించారనే అపవాదు తెచ్చుకున్నారు.
అమరావతిలో రాజధాని పెడితే మేము అడుక్కు తినాలా అని.. బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు లాంటి సీనియర్ నాయకులు ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేసి మూడు రోజులు గడవకుండానే.. జగన్ మావిగన్తో వైసీపీ ప్రాంతీయ వాదాన్ని పేల్చేశారు. జగన్ వ్యాఖ్యలతో అటు రాయలసీమలోనూ వైసీపీ గాలి తీసేసినట్లయింది.
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల విశ్వాసాన్ని సంపాదించి.. తిరుగులేని నాయకుడిగా ఎదగడానికి ఒక జీవిత కాలం సరిపోదు. కానీ ఒకే ఒక్క మాటతో దశాబ్దాల కాలం కష్టపడి.. తరతరాలుగా సంపాదించుకొన్న పేరు ప్రఖ్యాతులు మట్టికొట్టుకుపోవచ్చు. ఈ రెండో సినారియోకి ఉత్తమ ఉదాహరణగా నిలుస్తున్నారు జగన్మోహన్రెడ్డి.
మూడు రాజధానులకు ప్లాన్ బీ గా ఆయన ప్రతిపాదించిన మావిగన్పై సోషల్ మీడియాలో ఎలాంటి రియాక్షన్ వచ్చిందో ప్రజలంతా చూస్తూనే ఉన్నారు. ఈ స్పందన వైసీపీ పునాదులను కదిలిస్తోంది. నెట్లో పేలుతున్న జోకులు.. వేస్తున్న సైటైర్ల దెబ్బకు వైసీపీ వీరాభిమానులు, ఆ పార్టీకి అన్ని విషయాల్లో సపోర్ట్ చేసిన మహా మేధావులు కూడా మావిగన్కి ఆమడ దూరం జరుగుతున్నారు.
