కడప రిమ్స్ ప్రాంగణంలో ఇటీవల జరిగిన వైసీపీ నేత, రియల్ ఎస్టేట్ వ్యాపారి పెద్ద దస్తగిరి హత్య వెనుక భారీ ఆస్తి వివాదం ఉన్నట్లు పోలీసులు తేల్చారు. దస్తగిరి నివాసంలో పోలీసులు జరిపిన సోదాల్లో దాదాపు రూ.100 కోట్ల విలువైన 145 ఆస్తి పత్రాలు లభించడం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ డాక్యుమెంట్లలో ఒరిజినల్ సేల్ డీడ్స్, అగ్రిమెంట్లు ఉండటం చూస్తుంటే, ఈ హత్య కేవలం కక్షలతో జరిగింది కాదని, భారీ భూదందా సెటిల్మెంట్లలో భాగమని స్పష్టమవుతోంది.
ఈ దారుణ హత్యకు సూత్రధారి కడప మాజీ డిప్యూటీ మేయర్, వైసీపీ నేత బండి నిత్యానందరెడ్డినే అని పోలీసులు నిర్ధారించారు. దస్తగిరికి, నిత్యానందరెడ్డికి మధ్య భారీగా ఆర్థిక, స్థిరాస్తి లావాదేవీలు ఉన్నాయని, ఆ విభేదాలే హత్యకు దారితీశాయని దర్యాప్తులో తేలింది. మొదట్లో ఇది రౌడీ గ్యాంగుల ఘర్షణగా భావించినప్పటికీ, నిందితులు తామంతా నిత్యానందరెడ్డి నడిపిస్తున్న క్రిమినల్ నెట్వర్క్ సభ్యులమని వాంగ్మూలం ఇవ్వడంతో కథ మలుపు తిరిగింది. హత్యకు అవసరమైన డబ్బు, వెహికిల్స్, ఆయుధాలు అన్నీ నిత్యానందరెడ్డే సమకూర్చినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
పోలీసుల విచారణలో మరికొన్ని దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. దస్తగిరిని చంపిన మూడు గంటల తర్వాత, నిందితులు A-2, A-9, A-10లు నేరుగా నిత్యానందరెడ్డి ఇంటికి వెళ్లి ఆయన్ను కలిశారు. ఆయన వారికి ఆశ్రయం కల్పించడమే కాకుండా, పారిపోవడానికి సాయం చేసినట్లు కాల్ డేటా రికార్డుల ద్వారా వెల్లడైంది. నిత్యానందరెడ్డిపై ఇప్పటికే హత్య, హత్యాయత్నం వంటి 5 కేసులు ఉండగా, ఈ కేసులో ఆయనను A-13గా చేర్చారు.
ప్రస్తుతం నిత్యానందరెడ్డి పరారీలో ఉండటంతో ఆయన విదేశాలకు పారిపోకుండా పోలీసులు లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. ఈ కేసులో మొత్తం 15 మంది నిందితులు ఉండగా, ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అరెస్టయిన వారిలో పేరం రాజు, పేరం రవి వంటి పాత నేరస్తులు ఉన్నారు. ఈ వ్యవస్థీకృత ముఠా వెనుక ఇంకా ఎంతమంది పెద్దలు ఉన్నారనే కోణంలో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. త్వరలోనే మరికొన్ని కీలక పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది.
