ABN, ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నుంచి ప్రాణహాని ఉందంటూ TDP సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. హత్యలు చేయించడంలో జగన్కు సాటిలేరని, ప్రజా సమస్యలను నిర్భయంగా వెలుగులోకి తెస్తున్న రాధాకృష్ణపై ఆయన దాడి చేయించే అవకాశం ఉందని బుచ్చయ్య ఆరోపించారు. వైసీపీ నాయకులు విషనాగుల్లాంటి వారని, ఆ పార్టీ కార్యకర్తలు బహిరంగంగానే నరుకుతామంటూ బెదిరింపులకు దిగుతున్నారని, రాధాకృష్ణ అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు.
ఇటీవల రాధాకృష్ణ తన కొత్త పలుకు కాలమ్ ద్వారా వైసీపీ వైఫల్యాలను, గత ప్రభుత్వ అరాచకాలను ఎండగట్టిన సంగతి తెలిసిందే. ఈ వ్యాసాలపై వైసీపీ శ్రేణులు తీవ్రంగా మండిపడ్డాయి. రాధాకృష్ణను వ్యక్తిగతంగా దూషించడమే కాకుండా, సోషల్ మీడియా వేదికగా విపరీతమైన ట్రోలింగ్ మరియు బెదిరింపులకు దిగారు. ఈ పరిణామాలను ప్రస్తావిస్తూనే, గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాధాకృష్ణ భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
జగన్ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబును అక్రమంగా 53 రోజులు జైల్లో పెట్టించారని, వ్యవస్థలను మేనేజ్ చేయడంలో ఆయన సిద్ధహస్తుడని గోరంట్ల విమర్శించారు. అప్పట్లో మీడియా గొంతు నొక్కేందుకు ప్రయత్నించారని, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా అదే అరాచక ధోరణిని కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. వైసీపీని ప్రజలు మళ్లీ ఎప్పటికీ నమ్మరని, వారిని అధికారంలోకి రానివ్వరని బుచ్చయ్య ధీమా వ్యక్తం చేశారు.
మూడోసారి టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడిగా నియమితులైన సందర్భంగా ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడిన గోరంట్ల, తనకు ఈ అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. అయితే, రాధాకృష్ణకు పొంచి ఉన్న ముప్పు గురించి బుచ్చయ్య చేసిన హెచ్చరికలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. బెదిరింపులకు భయపడకుండా వాస్తవాలు రాస్తున్న మీడియా ప్రతినిధులపై దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని బుచ్చయ్య హెచ్చరించారు.
