విజ్ఞాన్ యూనివర్సిటీ వద్ద యువకుడిపై దాడి చేసిన కేసులో ఏడుగురు నిందితులను చేబ్రోలు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను చేబ్రోలు ఎస్హెచ్ఓ పి. వీర నారాయణ, ఎస్ఐ వి. ఈశ్వర్ రావు వెల్లడించారు.
పోలీసుల కథనం ప్రకారం.. విజ్ఞాన్ యూనివర్సిటీలో చదువుతున్న హేమంత్ను అదే కాలేజీకి చెందిన శ్రీరామ్ అనే విద్యార్థి వేధింపులకు గురిచేసేవాడు. ఈ విషయాన్ని హేమంత్ తన స్నేహితుడైన, నాగార్జున యూనివర్సిటీ విద్యార్థి భరత్కు వివరించాడు. దీనిపై భరత్ ఫోన్ చేసి శ్రీరామ్ను హెచ్చరించాడు.
ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న శ్రీరామ్, ఈనెల 5వ తేదీన విజ్ఞాన్ యూనివర్సిటీ ఫెస్ట్ సందర్భంగా అక్కడికి వచ్చిన భరత్ను యూనివర్సిటీ ఎదురుగా ఉన్న సపోటా తోటల వద్దకు పిలిపించాడు. అక్కడ తన స్నేహితులతో కలిసి కర్రలు, ఇనుప రాడ్లు, నన్చక్లతో భరత్పై విచక్షణారహితంగా దాడి చేశాడు.
అంతేకాకుండా, ఆ దాడిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గుంటూరు జిల్లా ఎస్పీ వాకుల్ జిందాల్, తెనాలి డీఎస్పీ బి. జనార్ధనరావు ఆదేశాల మేరకు పొన్నూరు రూరల్ సీఐ పి. కృష్ణయ్య నేతృత్వంలో చేబ్రోలు పోలీసులు రంగంలోకి దిగారు.
విశ్వసనీయ సమాచారం మేరకు నారాకోడూరు గ్రామ పరిధిలోని వాటర్ ట్యాంక్ రోడ్డు వద్ద తలదాచుకున్న దారా పరిమళ్ రిహాన్, వెలిశెట్టి ఆదర్శ్ బాబు, వాకా సోమశేఖర్, రాపోలు తిరుపతిరావు, నందం బాల కోటేశ్వరావు, త్రోవగుంట బాల సాయిరామ్, కొత్తా సాయి అమర్ నాధ్ అనే ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
నిందితుల నుంచి దాడికి ఉపయోగించిన రెండు కర్రలు, ఒక నన్చాక్ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. యువత ఆవేశాలకు లోనై చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని, శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కేసును త్వరితగతిన ఛేదించిన పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.
