ప్రపంచంహోమ్

భారతీయులు లాగే మీరూ మాకు శత్రువులే : పాకిస్తాన్

#KhawajAsif

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో కొనసాగుతున్న ఆందోళనలు మరింత ఉద్రిక్తంగా మారాయి. నిరసనకారులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఘర్షణల్లో మరణించిన వారి సంఖ్య 20కు చేరిందని జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) బుధవారం ప్రకటించింది. అయితే ఈ మరణాల సంఖ్యను పాకిస్థాన్ అధికారులు ఖండిస్తూ, నిరసనకారులే భద్రతా సిబ్బందిపై కాల్పులు జరిపారని ఆరోపించారు.

ఈ నేపథ్యంలో పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. నిరసనకారులతో ఎలాంటి చర్చలు జరపబోమని స్పష్టం చేసిన ఆయన, “వారిని భారత్‌తో ఒకే కోవలో చూస్తున్నాను. వారు కూడా పాకిస్థాన్‌కు శత్రువులే” అని మీడియాతో వ్యాఖ్యానించారు.

మరోవైపు ప్రధాని సలహాదారు రానా సనౌల్లా మాట్లాడుతూ, JAAC ప్రతినిధులు తమను కలిసి 38 డిమాండ్లు సమర్పించారని చెప్పారు. అయితే నిరసనకారులు బలవంతంగా ముజఫరాబాద్, మీర్పూర్ నగరాలను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారని, వారి చర్యలు “భారత్ తరహా దాడిని” తలపిస్తున్నాయని ఆరోపించారు. అలాగే ఘర్షణల్లో ఎవరూ మరణించలేదని ఆయన పేర్కొన్నారు.

అయితే JAAC మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది. తమ కార్యకర్తలు ఆయుధాలు కాకుండా కేవలం కర్రలతోనే ర్యాలీలో పాల్గొన్నారని, భద్రతా బలగాలు కాల్పులు జరపడంతో కార్యకర్తలు మృతిచెందారని ఆరోపించింది. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు కూడా తెలిపింది. ఈ మరణాలపై స్వతంత్రంగా ధృవీకరణ జరగలేదు.

పాక్ ఆక్రమిత కాశ్మీర్ పోలీసు అధికారి కెప్టెన్ (రిటైర్డ్) లియాఖత్ అలీ మాలిక్ మాత్రం నిరసనకారుల వద్ద ఆధునిక ఆయుధాలు ఉన్నాయని, వారు భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని అధికారికంగా నమోదు చేసి పోస్టుమార్టం నిర్వహించిన తర్వాతే మరణాల సంఖ్యను నిర్ధారించగలమని తెలిపారు.

గత నెల నుంచి JAAC పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని శాసనసభలో వివాదాస్పదంగా భావిస్తున్న 12 స్థానాల అంశంపై నిరసనలు చేపడుతోంది. ఈ స్థానాల ద్వారా తమకు నచ్చిన నాయకుడిని ప్రధానమంత్రిగా నియమించేందుకు పాకిస్థాన్ వ్యవస్థ ప్రయత్నిస్తోందని JAAC ఆరోపిస్తోంది.

ఇక 53 సభ్యులున్న పాక్ ఆక్రమిత కాశ్మీర్ శాసనసభ ఎన్నికల్లో తొలి దశలో 13 స్థానాలకు సోమవారం పోలింగ్ జరగగా, పాకిస్థాన్ ముస్లిం లీగ్–నవాజ్ (PML-N) తొమ్మిది స్థానాల్లో విజయం సాధించింది. మిగిలిన స్థానాలకు ఆగస్టు 2, 10 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్‌సాఫ్ (PTI) ఎన్నికలను బహిష్కరించింది.

తొలి దశ ఎన్నికల్లో భారీ రిగ్గింగ్ జరిగిందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. కేంద్రంలో అధికార భాగస్వామిగా ఉన్న పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (PPP) కూడా PML-Nకు అక్రమంగా మెజారిటీ స్థానాలు కట్టబెట్టారని విమర్శించింది.

ఈ పరిణామాలపై భారత్ కూడా స్పందించింది. పాక్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్‌లో నిర్వహిస్తున్న ఎన్నికలు తమ అక్రమ ఆక్రమణను కప్పిపుచ్చుకునేందుకు పాకిస్థాన్ చేస్తున్న ప్రయత్నమని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్, లడఖ్‌తో పాటు ప్రస్తుతం పాకిస్థాన్ అక్రమంగా ఆక్రమించి ఉన్న ప్రాంతాలు కూడా భారతదేశంలో అంతర్భాగమేనని ఆయన పునరుద్ఘాటించారు.

అదేవిధంగా పాక్ ఆక్రమిత ప్రాంతంలో కొనసాగుతున్న భారీ ప్రజా నిరసనలు అక్కడి ప్రజల ఆర్థిక దోపిడీ, ప్రాథమిక హక్కుల నిరాకరణ, పరిపాలనా అణచివేతకు ప్రత్యక్ష ఫలితమని భారత్ పేర్కొంది. ఇదిలా ఉండగా, నిరసనలను అణచివేసేందుకు అధికారులు ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంతో పాటు, JAAC ఆందోళనలపై పాకిస్థాన్ మీడియాలో పూర్తిస్థాయి ప్రసార నిషేధం అమలు చేస్తున్నట్లు సమాచారం.

Related posts

లైంగిక దాడి చేసిన ఆటో డ్రైవర్ కు 20 ఏళ్ల జైలు

Satyam News

ఫిలిం ఫెడరేషన్ కు భవనం నిర్మించి ఇస్తా:చదలవాడ

Satyam News

తిరుమలలో ఘనంగా పార్వేటు ఉత్సవం

Satyam News

గద్వాలలో ప్రపంచ వినియోగదారుల దినోత్సవం

Satyam News

నందమూరి బాలకృష్ణ చొరవతో జాబ్ మేళా

Satyam News

కోర్టులో అంబటి వీడియో…. పొన్నవోలుకి జడ్జి షాక్‌…!!

Satyam News

Leave a Comment