శ్రీనగర్ మరియు లడఖ్ ప్రాంతాల మధ్య అన్ని వాతావరణాల్లోనూ నిరంతరాయంగా రవాణా సౌకర్యాన్ని కల్పించే ప్రతిష్టాత్మక ‘జోజిలా టన్నెల్’ నిర్మాణంలో ఒక కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (MEIL), సొరంగ మార్గంలో అత్యంత కష్టతరమైన ‘మేఘా బ్రేక్ త్రూ’ (సొరంగం రెండు చివరలను విజయవంతంగా అనుసంధానించడం) ప్రక్రియను పూర్తి చేసింది. దీనితో వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న ఈ రెండు ప్రాంతాల మధ్య త్వరలోనే నిరంతర రాకపోకలకు మార్గం సుగమం కానుంది.
ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, లెఫ్ట్నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పీ వీ కృష్ణా రెడ్డి, డైరెక్టర్ సి హెచ్ సుబ్బయ్య తదితరులు ఈ బ్రేక్ త్రూ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొని, ప్రాజెక్టు పురోగతిని పరిశీలించారు. ఇంజనీరింగ్ అద్భుతంగా నిలుస్తున్న ఈ టన్నెల్ నిర్మాణాన్ని శరవేగంగా, అత్యంత నాణ్యతా ప్రమాణాలతో ముందుకు తీసుకెళ్తున్న మేఘా సంస్థ ప్రతినిధులను, ఇంజనీర్లను ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మరియు ఇతర ప్రముఖులు అభినందించారు.
హిమాలయ పర్వత శ్రేణుల్లో, అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల నడుమ, సముద్ర మట్టానికి వేల అడుగుల ఎత్తులో ఈ జోజిలా టన్నెల్ నిర్మాణాన్ని చేపట్టడం ఒక సవాలుతో కూడుకున్న పని. ముఖ్యంగా శీతాకాలంలో భారీగా కురిసే మంచు కారణంగా శ్రీనగర్ – లడఖ్ మధ్య నెలల తరబడి రవాణా నిలిచిపోయేది. ఈ టన్నెల్ అందుబాటులోకి రావడం ద్వారా ప్రయాణ సమయం భారీగా తగ్గడమే కాకుండా, సరిహద్దుల్లో రక్షణ రంగానికి, స్థానిక ప్రజల ఆర్థిక వృద్ధికి మరియు పర్యాటక రంగానికి ఎంతో మేలు చేకూరనుంది. మేఘా సంస్థ సాధించిన ఈ బ్రేక్ త్రూతో లడఖ్ ప్రాంతానికి ఏడాది పొడవునా రవాణా అనుసంధానతను కల్పించాలనే దశాబ్దాల నాటి కల సాకారం కావడానికి అడుగు దూరంలో నిలిచింది
