హైడ్రాపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వాస్తవాలకు దూరంగా, హాస్యాస్పదంగా ఉన్నాయని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, జౌళి, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గాంధీ భవన్లో నిర్వహిస్తున్న ‘ముఖాముఖి’ కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
హైడ్రాను బంగాళాఖాతంలో వేస్తామని చెప్పడం విడ్డూరమని, బంగాళాఖాతంలో మునిగిపోయిన వాళ్లే హైడ్రాను బంగాళాఖాతంలో వేస్తామని చెప్పడం అర్థరహితమని మంత్రి వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ ఇప్పటి వరకు సుమారు 30 శాతం వర్షపాతం లోటు నమోదైందని తెలిపారు. దాదాపు 150 ఏళ్లలో చూడని తీవ్ర ఎల్నినో పరిస్థితులను రాష్ట్రం ఎదుర్కొంటోందని చెప్పారు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కూడా ఎల్నినో ప్రభావం కొనసాగే అవకాశం ఉందని, అందుకే ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోందని వివరించారు.
ప్రకృతి వైపరీత్య పరిస్థితులను గ్రామగ్రామాన ప్రజలకు వివరించి అవగాహన కల్పిస్తున్నామని, వ్యవసాయం, రెవెన్యూ, పంచాయతీరాజ్, విద్యుత్, నీటిపారుదల తదితర అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని మంత్రి తెలిపారు. పరిస్థితులకు అనుగుణంగా రైతులు మెట్ట పంటల సాగుపై దృష్టి సారిస్తున్నారని, ముఖ్యంగా ఆయిల్ పామ్ సాగు వైపు రైతులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు.
గాంధీ భవన్లో నిర్వహిస్తున్న ‘ముఖాముఖి’ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని మంత్రి తెలిపారు. గాంధీ భవన్ను ప్రజలు దేవాలయంలా భావించి, నమ్మకంతో తమ సమస్యలను చెప్పుకునేందుకు వస్తున్నారని అన్నారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి వినతి, ఫిర్యాదును వెంటనే సంబంధిత అధికారులకు పంపిస్తూ, వాటి పరిష్కారంపై నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామని చెప్పారు.
దేశంలో ఏ రాజకీయ పార్టీ నిర్వహించని విధంగా ప్రజలతో నేరుగా ముఖాముఖి నిర్వహిస్తున్నది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని మంత్రి పేర్కొన్నారు. పేదలు, సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందనే విశ్వాసంతో గాంధీ భవన్కు వస్తున్నారని అన్నారు.
ప్రజల నుంచి వచ్చిన సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్లతో నేరుగా మాట్లాడి తక్షణ చర్యలు తీసుకునేలా చూస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించడమే ప్రభుత్వం లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
