వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్లోని హరిత హోటల్లో ఈరోజు జరిగిన ‘సంఘటన్ సృజన్ అభియాన్’ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డా. ఎస్.ఏ. సంపత్ కుమార్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు వేమ్ నరేందర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వై ఎస్ షర్మిల తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల అధ్యక్షులు, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంపత్ కుమార్ మాట్లాడుతూ, క్వాలిటీ లీడర్షిప్ను పెంపొందించేందుకు ‘సంఘటన్ సృజన్’ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రతి కార్యకర్త నరనరాన ఎక్కించుకోవాలని పిలుపునిచ్చారు.
దేశవ్యాప్తంగా సంస్థాగత మార్పుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొన్నారు. నూతన జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం మాత్రమేనని, భవిష్యత్తులో మరిన్ని సంస్థాగత మార్పులు చోటుచేసుకుంటాయని తెలిపారు. ట్రైనింగ్ ప్రోగ్రామ్ల అవసరం ఎంతో ఉందని, 1970లో బాపట్లలో జరిగిన శిక్షణ శిబిరం పార్టీ బలోపేతానికి ఎంతో దోహదపడిందని గుర్తుచేశారు.
ఏఐసీసీ విధి విధానాలకు అనుగుణంగా నాయకులు నడుచుకోవాలని సీఎం సూచించినట్లు తెలిపారు. ప్రజల మద్దతుతో మున్సిపల్ ఎన్నికల్లో 90 శాతం మున్సిపాలిటీలను గెలుచుకున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే 14 రాష్ట్రాల్లో ‘సంఘటన్ సృజన్’ కార్యక్రమం విజయవంతమైందని, దేశం సురక్షితంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని సంపత్ కుమార్ అన్నారు. కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగగా, నాయకులు పార్టీ బలోపేతంపై చర్చలు జరిపారు.
