టెలికాం సేవల నాణ్యతను మెరుగుపరచడానికి భారత టెలికాం నియంత్రణ సంస్థ (TRAI) మరో కీలక ముందడుగు వేసింది. కాల్ డ్రాప్లు, కాల్ సమయంలో స్వరం స్పష్టంగా వినిపించకపోవడం, నెట్వర్క్ నాణ్యత లోపాలు వంటి సమస్యలపై వినియోగదారులు ఇకపై నేరుగా ట్రాయ్కు ఫిర్యాదు చేసే అవకాశం కల్పించింది.
ఈ మేరకు ట్రాయ్ తన ‘TRAI MyCall’ యాప్ను అధునాతన ఫీచర్లతో అప్గ్రేడ్ చేసింది. కొత్త వెర్షన్ ద్వారా మొబైల్ వినియోగదారులు తాము చేసిన వాయిస్ కాల్ నాణ్యతపై వెంటనే రేటింగ్ ఇవ్వడంతో పాటు ఎదురైన సమస్యలను నేరుగా నమోదు చేయవచ్చు.
యాప్లో కాల్ డ్రాప్లు, మధ్యలో స్వరం తెగిపోవడం, శబ్దం స్పష్టంగా వినిపించకపోవడం, నెట్వర్క్ బలహీనంగా ఉండటం వంటి సమస్యలను సులభంగా నివేదించవచ్చు. వినియోగదారులు అందించే ఈ ఫీడ్బ్యాక్ ఆధారంగా టెలికాం కంపెనీల సేవల నాణ్యతను ట్రాయ్ పర్యవేక్షించనుంది.
వినియోగదారుల నుంచి వచ్చే సమాచారం ద్వారా ఏ ప్రాంతాల్లో నెట్వర్క్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయో గుర్తించి, సంబంధిత టెలికాం సంస్థలకు సేవలు మెరుగుపరచాలని సూచనలు ఇవ్వనున్నట్లు ట్రాయ్ తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా కాల్ నాణ్యతను పెంచడం, వినియోగదారులకు మెరుగైన మొబైల్ సేవలు అందించడం లక్ష్యంగా ఈ చర్య చేపట్టింది.
టెలికాం సేవలపై వినియోగదారుల భాగస్వామ్యాన్ని పెంచేందుకు, సమస్యలను వేగంగా గుర్తించి పరిష్కరించేందుకు ‘TRAI MyCall’ యాప్ ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొన్నారు.
