రెండవ శనివారం సెలవు,ఆషాఢ మాస ఉత్సవాల వేళ ఇంద్రకీలాద్రి క్షేత్రం జనసముద్రంగా మారింది. ఉదయం 6 గంటల నుంచే ఆలయ పరిసరాలు భక్తజన సందోహంతో నిండిపోయాయి. ఘాట్ రోడ్,శ్రీ కనకదుర్గ నగర్ మార్గాల ద్వారా కొండపైకి భక్తులు ప్రవాహంలా తరలివచ్చారు. అంచనాలకు మించిన ఈ రద్దీని ఎదుర్కొనేందుకు కార్యనిర్వహణాధికారి వి.కె. శీనానాయక్ ఆధ్వర్యంలో ఆలయ యంత్రాంగం, వన్ టౌన్ పోలీసులు సమర్థవంతమైన రక్షణ చర్యలు చేపట్టారు.
రద్దీ అనుసరించి క్యూ లైన్లలో నిరీక్షించే సామాన్య భక్తులకు వీలైనంత వేగంగా దర్శనం కల్పించడమే లక్ష్యంగా దేవస్థానం ఉదయం 9 గంటల నుండి అంతరాలయ దర్శనాలను తాత్కాలికంగా రద్దు చేశారు.ఉదయం నుండి మధ్యాహ్నం 3వరకు వరకు అన్ని రకాల దర్శన టిక్కెట్లను రద్దు చేసి, అన్ని క్యూ లైన్లను ఉచిత దర్శన లైన్లుగా మార్చి గేట్లు తెరిచారు.
ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు అన్ని రకాల వీఐపీ దర్శనాలను పూర్తిగా నిలిపివేశారు. ఎండ తీవ్రత వల్ల భక్తులు ఇబ్బంది పడకుండా క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తుల వద్దకే సంచార నీటి డబ్బాల ద్వారా చల్లని తాగునీటిని అందించారు. చంటి బిడ్డల తల్లులు, వృద్ధులు, దివ్యాంగులను ప్రత్యేక లైన్ లో దర్శనంకు అనుమతించారు. కుటుంబం నుండి తప్పిపోయిన వృద్దురాలను ఈవో శీనా నాయక్ గుర్తించి,మైక్ ప్రచారం చేయించి వారి కుటుంబం చెంతకు చేర్చారు.
