విశాఖపట్నం జిల్లాలో రహదారి సౌకర్యం కోసం ఆదివాసులు చేపట్టిన వినూత్న నిరసన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నిన్న ఆదివారం రోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసులు సుమారు 5 కిలోమీటర్ల మేర డోలితో పాదయాత్ర నిర్వహించారు.
జాజులుబండ, పిట్రిగడ్డ, నీళ్లుబండ, పెదగరువు తదితర కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న పీవీటీజీ (PVTG) వర్గాల ప్రజలు కనీస రహదారి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. అత్యవసర వైద్యం కోసం సుమారు 20 కిలోమీటర్లు, ఓటు హక్కు వినియోగించుకునేందుకు దాదాపు 30 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యంగా గర్భిణులు ప్రసవం కోసం ఆసుపత్రులకు వెళ్లే సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కొండ ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం కల్పించి తమ సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదివాసులు కోరారు.
ఈ నిరసనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో వీడియో చూసిన నెటిజన్లు ఆదివాసుల పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
