మారుతున్న భద్రతా సవాళ్లకు అనుగుణంగా బెటాలియన్ పోలీసింగ్ను మరింత బలోపేతం చేయాలని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు. ములుగులోని 5వ తెలంగాణ స్పెషల్ పోలీస్ బెటాలియన్ను సందర్శించిన ఆయన అధికారులు, సిబ్బందితో సమావేశమయ్యారు.
యువతను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న సైబర్ నేరాలు, డ్రగ్స్ వినియోగం, ఆన్లైన్ బెట్టింగ్పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని డీజీపీ సూచించారు. కమ్యూనిటీ ఔట్రీచ్ ద్వారా ముందస్తు పోలీసింగ్కు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు.
బెటాలియన్ సిబ్బంది నిరంతర శిక్షణ, క్రమశిక్షణ, శారీరక దృఢత్వం, ఆపరేషనల్ ప్రిపేర్డ్నెస్తో ఎలాంటి అత్యవసర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు. ఆధునిక పోలీసింగ్కు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించాలని, శిక్షణ కార్యక్రమాలను మరింత పటిష్టం చేయాలని సూచించారు.
బెటాలియన్లో మౌలిక వసతుల అభివృద్ధితో పాటు సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని, ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ సమర్థంగా అమలు చేయాలని డీజీపీ ఆదేశించారు.
ఈ సందర్భంగా సిబ్బంది తమ సమస్యలు, అవసరాలను డీజీపీ దృష్టికి తీసుకురాగా, వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. బెటాలియన్ సమగ్ర అభివృద్ధి, సిబ్బంది సంక్షేమం కోసం అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో ఏడీజీపీ (బెటాలియన్స్) సంజయ్ కుమార్ జైన్, మల్టీ జోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, ములుగు ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, అదనపు ఎస్పీ మానన్ భట్ తదితర అధికారులు, బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు.
