అనేక సినిమాల్లో, టివి సీరియల్స్ లో నటించిన జయవాహిని క్యాన్సర్ తో పోరాటం చేస్తోంది. ఆమె నటించినందుకు కొద్ది మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుని ఉండొచ్చు. అంత మాత్రాన ఆమె చావు బతుకుల్లో ఉంటే సినిమా రంగం పట్టించుకోదా? సాటి నటులకు కూడా పట్టదా?
జయవాహిని తెలుగు సినిమాలతో పాటు తమిళ సినిమాల్లోను సహాయ నటి పాత్రలు పోషించింది. పెద్ద స్టార్ ఇమేజ్ రాకపోవచ్చు. కానీ నటే కదా! వెయ్యి కోట్లు, వందల కోట్లు వసూళ్లు అంటూ పేపర్ స్టేట్ మెంట్స్ ఇచ్చే నిర్మాతలు ఒక్క ప్రాణాన్ని బతికించలేరా? అంటూ జయవాహిని విషయంలో సినీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. 10 కోట్లు, వంద కోట్లు రెమ్యూనరేషన్ తీసుకునే హీరోలకు ఇలాంటి విషయాలు పట్టకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
సినిమా విడుదలకు ముందు టికెట్ రేట్లు పెంచుకోవడం, వినోదం పేరిట జనం డబ్బును దోచుకోవడంలో వున్న ఆసక్తి చిన్న చిన్న నటులను కాపాడుకోవడంలో ఉండదా? అని అడుగుతున్నారు. నువ్వు నేను సీరియల్ నటిగా జయవాహిని పాపులర్ అయ్యారు. “పోలీసు వారి హెచ్చరిక” ఆమె నటించిన చివరి సినిమా. కొంతకాలంగా బ్రెస్ట్ క్యాన్సర్ తో పోరాటం చేస్తున్నారు. మల్టీ ఆర్గాన్స్ దెబ్బతినడంతో ప్రస్తుతం ఐసీయూ లో చికిత్స పొందుతున్నారు. ఆమె శస్త్ర చికిత్స కోసం 35 లక్షల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు.
