వైఎస్సార్ కాంగ్రెస్ని వీడిన నేతలు.. ఆ పార్టీ పెద్దలను టెన్షన్ పెడుతున్నారు. నా జోలికొస్తే మీ సీక్రెట్లు బయటపెడతా అని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇచ్చిన వార్నింగ్తో.. తాడేపల్లి ప్యాలెస్ సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయింది. రీసెంట్గా వైసీపీని వీడిన బొత్స సత్యానారాయణ మేనల్లుడు.. మజ్జి శ్రీనివాస్ అలియాస్ చిన్న శీను చేతిలో.. జగన్కి సంబంధించిన కీలక గుట్టుమట్లు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది.
2018 అక్టోబర్లో వైజాగ్ ఎయిర్పోర్టులో.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కోడికత్తితో దాడి జరిగింది. అయితే ఈ కోడికత్తి వ్యవహారానికి సంబంధించిన కథ మొత్తం చిన్న శీనుకి తెలుసని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. అసలు ఈ కోడికత్తి డ్రామా వెనుక కర్త, కర్మ చిన్న శీను.. అనే టాక్ కూడా వినిపించింది. జగన్పై హత్యాయత్నం జరిగిందని ప్రజల ముందుకు వెళ్లి.. ఆ సానుభూతి ఓట్లతో 2019లో వైసీపీ భారీ విజయం సొంతం చేసుకొంది.
తర్వాత కాలంలో ఈ కేసు దర్యాప్తు ఎన్ఐఏ చేతికి వెళ్లినా.. ఇప్పటికీ దీని వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరనేది బయటకు రాలేదు. ఇప్పుడు చిన్న శీను వైసీపీని వీడి.. తెలుగుదేశం పార్టీలో చేరడంతో.. ఆనాటి కోడికత్తి స్టోరీ మొత్తం బయటపెడతారేమో అని వైసీపీ పెద్దలు టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. పార్టీకి సంబంధించిన ప్రతి మీటింగ్లోనూ బొత్స సత్యనారాయణ భోరున విలపించడం.. తలచుకొని తలచుకొని కుమిలిపోవడానికి ఇదే అసలు కారణం అనే వాదన కూడా వినిపిస్తోంది.
జగన్ అధికారంలో ఉండగా చేసిన అవినీతి, అక్రమ భాగోతాలు.. ప్రతిపక్షంలో ఉండగా చేసిన కుట్రలు, కుతంత్రాలకు సంబంధించిన సమస్త సమాచారం.. తాజా మాజీ వైసీపీ నేతల దగ్గర ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ని మీడియా ముందు పెడితే జగన్ పరువు పోతుంది. అదే కూటమి ప్రభత్వం చేతిలో పెడితే.. జగన్తో సహా వైసీపీ ముఖ్య నాయకులంతా మరిన్ని కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది. అందుకే విజయసాయి రెడ్డి ఎన్ని కౌంటర్లు వేస్తున్నా.. తాడేపల్లి ప్యాలెస్ నుంచి సౌండ్ రావడం లేదు. చిన్న శీను పార్టీ మారినా.. ఎదురుదాడులు, వ్యక్తిత్వ హననాలు వంటి తీవ్రమైన చర్యలకు దిగకుండా.. సింపుల్గా లైట్ తీసుకున్నారు.
