తెలంగాణ శాసన మండలి వేదికగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ విజయశాంతి తన సొంత ప్రభుత్వంపైనే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాడిన ఉద్యమకారుల పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న ఉదాసీన వైఖరిపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం మండలి సమావేశాల్లో భాగంగా జరిగిన చర్చలో ఆమె మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా.. మేనిఫెస్టోలో ఉద్యమకారులకు ఇచ్చిన కీలక హామీలను అమలు చేయడంలో జాప్యం జరుగుతోందని అగ్రహం వ్యక్తం చేశారు.
ఉద్యమకారులు లేకపోతే మీ పదవులు ఎక్కడివి?
సభలో విజయశాంతి తన మార్క్ యాక్షన్ స్టైల్లో ప్రసంగిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. “తెలంగాణ ఉద్యమకారులు నాడు రోడ్లపైకి వచ్చి, లాఠీ దెబ్బలు తిని, జైళ్లకు వెళ్లకుంటే ఈరోజు ప్రత్యేక రాష్ట్రం వచ్చేదా? ఆనాడు వారు చేసిన పోరాటం వల్లే కదా ఇవాళ మీరు ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా చలామణి అవుతున్నారు. ఆ ఉద్యమకారులను విస్మరిస్తే ఊరుకునేది లేదు” అంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. అమరవీరుల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు, ఉద్యోగాలు, ప్రభుత్వ పెన్షన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను తక్షణమే నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీపై ‘క్వాలిటీ’ అస్త్రం
ఉద్యమకారుల అంశంతో పాటు రాష్ట్రంలో పేద ప్రజారోగ్యంపై విజయశాంతి ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రులు సామాన్యులను పీల్చి పిప్పి చేస్తున్నాయని మండిపడ్డారు. ఆరోగ్య రంగంలో ప్రభుత్వం ‘క్వాలిటీ’ (నాణ్యత) పెంచాల్సిన అవసరం ఉందని, వైద్య సేవలు అందక పేదలు అల్లాడుతుంటే చూస్తూ ఊరుకోలేమని స్పష్టం చేశారు. స్వపక్షాన్ని ఉద్దేశించి ఆమె చేసిన ఈ సంచలన వ్యాఖ్యలతో సభ ఒక్కసారిగా నిశ్శబ్దంలో మునిగిపోయింది. ప్రతిపక్ష సభ్యులు సైతం రాములమ్మ వ్యాఖ్యలకు మద్దతుగా డెస్కులు చరిచారు. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వ లోపాలను సొంత పార్టీ ఎమ్మెల్సీయే ఎండగట్టడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
