సుప్రసిద్ధ పూరీ జగన్నాథ రథోత్సవంలో అనుకోని సంఘటన జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయంలో వార్షిక రథయాత్ర సందర్భంగా గురువారం భారీగా తరలివచ్చిన భక్తజన సందోహం కారణంగా సింహద్వారం వద్ద తీవ్ర రద్దీ నెలకొంది. వేలాదిమంది ఒకేసారి ఆలయ ప్రవేశ ద్వారం వైపు చేరుకోవడంతో పలువురు భక్తులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అత్యవసర సహాయక బృందాలు, భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి అస్వస్థతకు గురైన వారిని స్ట్రెచర్లపై తరలించి వైద్య చికిత్స అందించారు.
మీడియా కథనాల ప్రకారం కనీసం 52 మంది భక్తులు శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులకు గురైనట్లు సమాచారం. రద్దీ తీవ్రంగా ఉండటంతో భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు, వైద్య సిబ్బంది సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు జనసంచారాన్ని నియంత్రిస్తూ, అవసరమైన చోట వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు.
ఇదిలా ఉండగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శ్రీ జగన్నాథ రథయాత్ర ఆధ్యాత్మిక వైభవం మధ్య గురువారం ఘనంగా ప్రారంభమైంది. దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు పూరీ బడదండా (గ్రాండ్ రోడ్) వెంట చేరుకుని జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి రథాల దర్శనం కోసం వేచి ఉన్నారు. భక్తుల జయజయధ్వానాలు, వేదఘోషలు, భజనల నడుమ పూరీ పట్టణమంతా ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది.
సంప్రదాయం ప్రకారం ఆలయ గర్భగుడి నుంచి దేవతలను రథాల వద్దకు తీసుకువచ్చే “పహాండి” కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. తొలుత శ్రీ సుదర్శన చక్రాన్ని బయటకు తీసుకువచ్చి రథంపై ప్రతిష్ఠించారు. అనంతరం శ్రీ బలభద్రుడు, దేవి సుభద్ర, చివరగా జగన్నాథ స్వామిని భక్తుల హర్షధ్వానాల మధ్య రథాలపై అధిష్ఠింపజేశారు. ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు గంటల తరబడి వేచి ఉండగా, ఆలయ పరిసరాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
