ప్రత్యేకం హోమ్

తప్పుడు ప్రచారం చేస్తున్న జగన్ పార్టీ నేతలపై చర్యలు

#CMMeeting

రాష్ట్రంలో కల్తీ లిక్కర్ తయారీ, అమ్మకాలను ఏ మాత్రం ఉపేక్షించవద్దని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కల్తీ లిక్కర్‌తో ప్రజల ప్రాణాలను హరించే వారిపై కఠిన చర్యల ద్వారా ఉక్కుపాదం మోపాలని సీఎం స్పష్టం చేశారు. 15 నెలల్లో పటిష్ట చర్యల ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌ను అరికట్టామని…ఇంతే సమర్థవంతంగా పనిచేసి రాష్ట్రంలో కల్తీ లిక్కర్ అనేది లేకుండా చేయాలని చెప్పారు.

ఏ ఒక్క చోటా కల్తీ లిక్కర్ తయారీ కేంద్రాలు కానీ, అటువంటి వ్యక్తులు కానీ ఉండకూడదని సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అన్నమయ్య జిల్లాలో కల్తీ లిక్కర్ వ్యవహారంలో తీసుకున్న చర్యలను, దర్యాప్తు వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

అన్నమయ్య జిల్లా ములకలచెరవు కేసులో మొత్తం 21 మంది నిందితులుగా గుర్తించామని…అందులో ఇప్పటికి వరకు 12 మందిని అరెస్టు చేశామని…మిగితా నిందితులను కూడా త్వరలో అరెస్టు చేస్తామని తెలిపారు. ములకలచెరువు కేసులో ఎ1 గా ఉన్న అద్దేపల్లి జనార్థన్‌రావు లావాదేవీలు, వ్యాపారాలపై విచారణ జరపుతున్నామని తెలిపారు.

ముకలచెరువు కేసుల ఆధారంగా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో జనార్థన్‌రావుకు చెందిన వ్యాపారాలపై తనిఖీలు జరిపామని తెలిపారు. ఈ తనిఖీల్లో కిరాణా షాప్ వెనుక కల్తీ మద్యం నిల్వలను గుర్తించినట్లు తెలిపారు. అద్దేపల్లి జనార్ధన్‌రావు ఇబ్రహీంపట్నంలోని మెస్సర్స్ ANR బార్ & రెస్టారెంట్‌ నిర్వహిస్తున్నాడు. అతను 15 సంవత్సరాలుగా మద్యం వ్యాపారం చేస్తున్నాడు.

అధిక లాభాల కోసం నకిలీ మద్యం తయారీ ద్వారా చట్ట విరుద్ద కార్యక్రమాలు నిర్వహించారు. తన సోదరుడు అద్దేపల్లి జగన్ మోహన్ రావు ద్వారా కల్తీ మద్యం తయారీ, సరఫరా, అమ్మకం చేపట్టాడు. వీరిద్దరు కొందరితో కలిసి కల్తీ మద్యం తయారు చేసినట్లు తనిఖీల్లో గుర్తించామని అధికారులు తెలిపారు.

ఇక్కడ జరిపిన తనిఖీల్లో  కల్తీ లిక్కర్ సీసాలు పట్టుకున్నామని తెలిపారు. ఇక్కడ కల్తీ లిక్కర్ వ్యవహారంలో మొత్తం 12 మందిని నిందితులుగా గుర్తించామని వీరిలో ముగ్గురిని ఇప్పటికి అరెస్టు చేశామని తెలిపారు. నలుగురిని పీటీ వారెంట్‌పై తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు. నిందితుల కాల్ రికార్డులతో పాటు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని అధికారులు వివరించారు.

కఠినంగా వ్యహరించండి…ఫేక్ ప్రచారంపైనా చర్యలు తీసుకోండి

కల్తీ లిక్కర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేసిన ముఖ్యమంత్రి…..ఈ మొత్తం వ్యవహారంలో పలు కీలక సూచనలు చేశారు. అన్నమయ్య జిల్లాలో జరిగిన కల్తీ లిక్కర్ వ్యవహారంపై రాష్ట్రంలో రాజకీయ పక్షాలు తప్పుడు ప్రచారంతో రాజకీయ ప్రయోజనం కోసం ప్రయత్నం చేస్తున్నాయని సీఎం అన్నారు.

రాష్ట్రం అంతటా కల్తీ లిక్కర్ అని తప్పుడు ప్రచారంతో ప్రజలను భయపెడుతున్నారని….ప్రతి మూడు బాటిల్స్‌లో ఒక బాటిల్ కల్తీ లిక్కర్ బాటిల్ ఉందని ఫేక్ ప్రచారం చేస్తున్నారని సీఎం అన్నారు. రాష్ట్రంలో కల్తీ లిక్కర్‌తో ప్రాణాలు పోతున్నాయని ఫేక్ ప్రచారాలు మొదలు పెట్టిన విషయాన్ని మంత్రులు కూడా అర్థం చేసుకోవాలని…. వైసీపీ నేతల రాజకీయ కుట్రలను ఎప్పటికప్పుడు భగ్నం చేయాలని సూచించారు.

కల్తీ లిక్కర్ కారణంగానే అక్కడ చనిపోయారు…ఇక్కడ చనిపోయారు అని ప్రచారం చేస్తున్నారని…. ప్రతీ ఆరోపణ పైనా విచారణ జరపించాలని అధికారులను సీఎం ఆదేశించారు. అవసరమైతే పోస్టుమార్టం వంటి విధానాల ద్వారా మృతికి కారణాలు సైంటిఫిక్‌గా నిర్థారించి…వాస్తవాలు వెల్లడించాలని అధికారులను ఆదేశించారు. ఏది నిజమో చెప్పడంతో పాటు..రాజకీయ కుట్రల్లో భాగంగా సహజ మరణాలపై తప్పుడు ప్రచారాలు చేసేవారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

కల్తీ లిక్కర్‌తో మరణాలు అని ప్రచారం చేస్తే దానికి రుజువు చూపాలని అడగాలని…తప్పుడు ప్రచారం అని తేలితే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సీఎం అన్నారు. మీడియా అయినా, సోషల్ మీడియా అయినా తప్పుడు ప్రచారం చేస్తే ఉపేక్షించవద్దని సీఎం స్పష్టం చేశారు. ప్రజలను భయబ్రాంతులకు గురిచేసి లాభం పొందుదామనుకుంటే ప్రభుత్వం, ప్రభుత్వ శాఖలు సైలెంట్‌గా చూస్తూ ఊరుకోవని సీఎం హెచ్చరించారు.

ఏ అంశాలు లేకనే తప్పుడు ప్రచారం

ఈ సమావేశానికి మంత్రులు కొల్లు రవీంద్ర, లోకేష్ నేరుగా హాజరవ్వగా..హోంమంత్రి సహా పలువురు మంత్రులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రులకు సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. 2019లో వివేకా హత్య సమయంలో వైసీపీ ఆడిన డ్రామాలు, శవ రాజకీయాలను మరిచిపోవద్దని చెప్పారు. వాళ్లు ఫేక్ ప్రచారంతోనే ప్రజలను నమ్మించాలనే ప్రయత్నంలో ఉంటారని…మీరు  మరింత చురుగ్గా, వేగంగా వాటిని తిప్పికొట్టాలని అన్నారు.

ఈ విషయంలో వైసీపీ గత చరిత్ర, వారి కుట్ర రాజకీయాలను ప్రజల్లో ఎండగట్టాలని సూచించారు. ప్రతి ఘటనపైనా, ప్రతి సమస్యపైనా ప్రభుత్వం స్పందిస్తోందని, ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి వైసీపీకి  ఏ కారణాలు దొరకడం లేదన్నారు. అందుకే తప్పుడు ప్రచారాలతో రాద్దాంతం చేయాలని చూస్తున్నారని అన్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తున్నాం…దీంతో విమర్శలకు అవకాశం లేని వైసీపీ….తమ రాజకీయ సిద్దాంతమైన ఫేక్ ప్రచారాన్నే నమ్ముకుందని సీఎం దుయ్యబట్టారు. అయితే ప్రజలు ఇప్పుడు వీటిని నమ్మే పరిస్థితి లేదని….అయినా మంత్రులుగా, ప్రజా ప్రతినిధులుగా ఏది మంచి ఏది చెడు అనేది ప్రజలకు వివరించే బాధ్యత మనపై ఉందని సీఎం చంద్రబాబు అన్నారు.

Related posts

గో సేవలో ఎక్సైజ్ శాఖ మంత్రి….

Satyam News

మరచిపోలేని మంచి చిత్రం “నేనెవరు?”

Satyam News

ధర్మస్థలిపై తప్పుడు ఆరోపణ చేసిన వ్యక్తి అరెస్టు

Satyam News

Leave a Comment

error: Content is protected !!