మోస్ట్ వాంటెడ్ అంతర్రాష్ట్ర దొంగ షేక్ రఫీ అలియాస్ ‘పొట్టి రఫీ’ని పల్నాడు జిల్లా వినుకొండ పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.
వినుకొండకు చెందిన వజ్రాల విరేంద్ర రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రభాకర రావు నేతృత్వంలోని ప్రత్యేక బృందం నిందితుడిని అరెస్టు చేసింది. నిందితుడి వద్ద నుంచి సుమారు రూ.27 లక్షల విలువైన ఆస్తిని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 7.257 కిలోల వెండి వస్తువులు, 6 గ్రాముల బంగారు కమ్మలు, రూ.1.70 లక్షల నగదు ఉన్నాయి. అలాగే దొంగతనాలకు ఉపయోగించిన రాయల్ ఎన్ ఫీల్డ్ హంటర్ బైక్తో పాటు బజాజ్ మాగ్జిమాను కూడా పోలీసులు సీజ్ చేశారు.
ప్రాథమిక విచారణలో గుంటూరు, ప్రకాశం, పల్నాడు, చిత్తూరు జిల్లాల్లో నమోదైన దాదాపు 25 దొంగతనం కేసుల్లో పొట్టి రఫీ నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసును ఛేదించి నిందితుడిని అరెస్టు చేసిన వినుకొండ పోలీసు బృందాన్ని హనుమంతరావు ప్రత్యేకంగా అభినందించారు.
