హైదరాబాద్హోమ్

విద్యాసంస్థల్లో డ్రగ్స్‌పై జీరో టాలరెన్స్ విధానం

#CVAnand

రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలను పూర్తిస్థాయిలో డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దడంతో పాటు విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, సంక్షేమాన్ని పరిరక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోందని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)  సి.వి. ఆనంద్, ఐపీఎస్ తెలిపారు. ఈ లక్ష్యంతో  ఈగల్ అధికారులతో బుధవారం డీజీపీ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ మానవతా విలువలు, క్రమశిక్షణ, బాధ్యతాయుత పౌరులను తీర్చిదిద్దే విద్యాసంస్థల్లో డ్రగ్స్‌కు ఏమాత్రం చోటు ఉండకూడదని స్పష్టం చేశారు. పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థలు డ్రగ్స్ రహిత ప్రాంతాలుగా ఉండేలా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా సమగ్ర భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయడం అత్యంత కీలకమని పేర్కొన్నారు.

రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్స్ అండ్ సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అలాగే ప్రతి విద్యాసంస్థలో క్యాంపస్ సేఫ్టీ కోఆర్డినేటర్ నియామకాన్ని తప్పనిసరి చేయాలని సూచించారు. విద్యార్థుల భద్రత, డ్రగ్స్ నివారణ చర్యలు, అవగాహన కార్యక్రమాలు, కౌన్సెలింగ్, తల్లిదండ్రులతో సమన్వయం వంటి అంశాలను ఈ కమిటీలు పర్యవేక్షించనున్నాయి.

సమావేశంలో ఈగల్ అధికారులు యాంటీ డ్రగ్స్ అండ్ సేఫ్టీ కమిటీల నిర్మాణం, బాధ్యతలు, అమలు విధానం, పర్యవేక్షణ వ్యవస్థ, విద్యాసంస్థలు పాటించాల్సిన నిబంధనలకు సంబంధించిన సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రజెంటేషన్‌ను పరిశీలించిన డీజీపీ, విధివిధానాలను మరింత సమర్థవంతంగా రూపొందించే దిశగా పలు మార్పులు, చేర్పులు సూచిస్తూ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

అలాగే విద్యాశాఖ అధికారులు, ఇతర సంబంధిత శాఖలు, నిపుణుల సూచనలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (SOPs), మార్గదర్శకాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. తుది ప్రతిపాదనను ప్రభుత్వానికి సమర్పించే ముందు మరో సమీక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.

డ్రగ్స్‌పై జీరో టాలరెన్స్ విధానం

విద్యాసంస్థల్లో డ్రగ్స్ విషయంలో జీరో టాలరెన్స్ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని డీజీపీ స్పష్టం చేశారు. డ్రగ్స్ విక్రయం, వినియోగం లేదా ప్రోత్సాహానికి సంబంధించిన ఘటనలు వెలుగులోకి వస్తే సంబంధిత విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ఆయా విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేసేలా సంబంధిత అధికారులకు సిఫార్సు చేయాలని ఆదేశించారు.

విద్యార్ధులకు డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కల్పించడం, సైకాలజిస్టులు, కౌన్సెలర్ల సేవలు అందుబాటులో ఉంచడం, అవసరమైన వారికి కౌన్సెలింగ్ అందించడం, తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని పెంచడం, స్వచ్ఛంద సంస్థల (NGOs) సహకారంతో నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వంటి అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.

డ్రగ్స్ నియంత్రణలో పోలీసు శాఖ, విద్యాశాఖ, ఆరోగ్యశాఖ, ఇతర సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి సమర్థవంతమైన కార్యాచరణను అమలు చేయాలని డీజీపీ అధికారులను ఆదేశించారు. “ప్రతి విద్యార్థికి సురక్షితమైన, ఆరోగ్యకరమైన, డ్రగ్స్ రహిత విద్యా వాతావరణాన్ని కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం” అని డీజీపీ  సి.వి. ఆనంద్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఈగల్ డైరెక్టర్  సందీప్ శాండిల్య, ఐజీ  పద్మజా రెడ్డి, ఎస్పీ  గిరిధర్ తో పాటు ఈగల్ ఫోర్స్‌కు చెందిన ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

Related posts

ఆర్టీసీ సమ్మెకు బీసీ రాజ్యాధికార సమితి మద్దతు

Satyam News

యూరోపియన్ యూనియన్ తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం

Satyam News

అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యం నిజమేనా…?

Satyam News

మోడీ నిర్ణయం పై విరుచుకుపడ్డ సోనియాగాంధీ

Satyam News

సొంత కూటమి దేశాలపై ట్రంప్ దారుణ వ్యాఖ్యలు

Satyam News

శ్రీ గోదాదేవి శ్రీ మహాలక్ష్మీదేవి సమేత శ్రీ ప్రసన్న రంగనాథ స్వామి కల్యాణం

Satyam News

Leave a Comment