వ్యవసాయ కార్మికులు, ఉపాధి కూలీలకు అండగా కార్మిక వర్గం నిలబడాలని, వ్యవసాయ కార్మికుల మహాసభలకు జిల్లాలోని కార్మిక వర్గం అధిక సంఖ్యలో హాజరై మహాసభలను జయప్రదం చేయాలని సిఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఉప్పేర్ నరసింహ, వివి నరసింహ కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని స్థానిక సిఐటీయూ జిల్లా కార్యాలయంలో ఐకేపీ VOA లు ఏర్పాటు చేసిన జిల్లా కమిటీ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కార్మికులు ఉపాధి కూలీలకు అండగా వారు చేసే పోరాటాలకు మద్దతుగా కార్మిక వర్గం అండగా నిలబడాలని అన్నారు. ఇప్పటికే యూనియన్ గవర్నమెంట్ లేబర్ కోడ్ ల ద్వారా కార్మిక వర్గ ప్రజాతంత్ర హక్కులను కాలరాస్తున్నదని, కార్మికుల వ్యవసాయ ఉపాధి కూలీలు ఐక్యంగా ఉండవలసిన అవసరం ఉందన్నారు. కార్మిక కర్షక మైత్రి స్పూర్తితో వ్యవసాయ కూలీలకు మద్దతుగా జూన్ 20 న మహబూబ్ నగర్ లో జరిగే వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభలకు జిల్లా లోని కార్మిక వర్గం అధిక సంఖ్యలో హాజరై మహాసభలను జయప్రదం చేయాలని కోరారు.
ఈ సందర్భంగా ఐకెపి వివోఏ ఉద్యోగుల సంఘం (సిఐటియు అనుబంధం) జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డ్యామ్ అంజి తిమ్మప్ప మాట్లాడుతూ వ్యవసాయ కూలీలు, పేదలు కొనుగోలు శక్తి పెరిగితేనే గ్రామీణ ప్రాంతాలలో పేదల బతుకులు మారుతాయని అటువంటి పేదలకు అండగా జరిగే మహాసభలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.
వ్యవసాయ కూలీలు కార్మికులు ఒకరికి ఒకరు సహకరించుకుని తమ సమస్యల పరిష్కారం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని ఆ దిశగా జరిగే ఇటువంటి మహాసభలకు తాము సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. సమావేశంలో ఐకేపీ VOA సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎం శ్రీనివాస్, సరస్వతి,తిరుమలేష్ ,కమిటీ సభ్యులు వెంకటరామయ్య,జయన్న, వెంకటేష్,లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.
