భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2026 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు ముందు గూగుల్కు చెందిన ఏఐ ప్లాట్ఫామ్ ‘జెమినీ’తో రూ.270 కోట్ల విలువైన భారీ స్పాన్సర్షిప్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం మూడేళ్ల కాలానికి ఉండనుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. “ఈ డీల్ ఐపీఎల్కు ఉన్న ప్రపంచవ్యాప్త ఆదరణకు మరో నిదర్శనం” అని ఓ బీసీసీఐ అధికారి పేర్కొన్నారు.
జెమినీకి ప్రత్యర్థిగా ఉన్న చాట్జీపీటీ ప్రస్తుతం కొనసాగుతున్న మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)కు స్పాన్సర్గా ఉంది. గత ఏడాది రియల్ మనీ గేమింగ్ ప్లాట్ఫామ్లైన డ్రీమ్11 వంటి వాటిని కేంద్ర ప్రభుత్వం నిషేధించడంతో, బీసీసీఐ కొత్త జెర్సీ స్పాన్సర్ కోసం వెతకాల్సి వచ్చింది. ఆ సమయంలో అపోలో టైర్స్ రూ.579 కోట్లకు జెర్సీ స్పాన్సర్ హక్కులను దక్కించుకుంది.
ప్రపంచంలోనే అతిపెద్ద టీ20 లీగ్గా గుర్తింపు పొందిన ఐపీఎల్కు టైటిల్ స్పాన్సర్గా టాటా గ్రూప్ కొనసాగుతోంది. తాజాగా జెమినీతో కుదిరిన స్పాన్సర్షిప్ ఒప్పందం భారత క్రికెట్పై ఏఐ ప్లాట్ఫామ్ల ఆసక్తి వేగంగా పెరుగుతోందని సూచిస్తోంది. గత నవంబర్లో డబ్ల్యూపీఎల్తో చాట్జీపీటీ అనుబంధం ప్రకటించిన సమయంలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఈ భాగస్వామ్య ప్రాధాన్యతపై మాట్లాడారు.
“ఏఐ, తయారీ, పానీయాల రంగాల్లోని గ్లోబల్ లీడర్లు, విశ్వసనీయ భారతీయ బ్రాండ్లు కలిసి పనిచేయడం ద్వారా అభిమానుల అనుభవాన్ని మరింత మెరుగుపరచడంతో పాటు మహిళల క్రికెట్ అభివృద్ధికి ఇది కీలకంగా నిలుస్తుంది” అని ఆయన తెలిపారు. ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 26 నుంచి మే 31 వరకు జరగనుంది.
