రక్షణ రంగంలో భారత్ మరో కీలక అడుగు వేసింది. భవిష్యత్ యుద్ధవిమానాల కోసం 120 కిలోన్యూటన్ తరగతి కాంబాట్ జెట్ ఇంజిన్ కోర్ను సంయుక్తంగా అభివృద్ధి చేయడానికి భారతదేశంతో కలిసి పనిచేసేందుకు రోల్స్ రాయిస్ ప్రతిపాదించింది. భారతదేశానికి స్వదేశీ తదుపరి తరం ఇంజిన్ అభివృద్ధిలో ఇది కీలకం కానున్నది.
ఈ జాయింట్ వెంచర్ ద్వారా పూర్తి సాంకేతిక బదిలీతో పాటు మేధోసంపత్తి హక్కులు భారత్కే చెందేలా ఒప్పందం ఉండనుందని రోల్స్ రాయిస్ సంస్థ వెల్లడించింది. ప్రత్యేక డిజైన్ సముదాయం, తయారీ సామర్థ్యాల ఏర్పాటుతో దేశంలో భారీగా ఉపాధి అవకాశాలు సృష్టించనున్నామని కూడా సంస్థ పేర్కొంది.
రోల్స్-రాయిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టుఫాన్ ఎర్గిన్బిల్గిచ్ న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలుసుకుని, భారత్ అభివృద్ధి యాత్రలో భాగస్వామ్యం కావాలనే సంస్థ సంకల్పాన్ని వివరించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు మద్దతు ఇవ్వాలని సంస్థ ఉద్దేశం తెలిపింది.
పెద్ద పెద్ద కంపెనీల పోటీలో నెగ్గిన రోల్స్ రాయిస్
ఇది వెలువడిన నేపథ్యంలో Defence Research and Development Organisation (డీఆర్డీఓ) ఇటీవలే అడ్వాన్స్డ్ హై-త్రస్ట్ క్లాస్ ఇంజిన్ (AHTCE) కార్యక్రమానికి సంబంధించి భారత రక్షణ, అంతరిక్ష సంస్థల నుంచి డెవలప్మెంట్-కమ్-ప్రొడక్షన్ పార్ట్నర్ ఎంపికకు ఆసక్తి వ్యక్తీకరణ (EOI) ఆహ్వానించింది.
ఈ ప్రోగ్రామ్కు డీఆర్డీఓకు చెందిన Gas Turbine Research Establishment (జీటీఆర్ఈ) నాయకత్వం వహిస్తుంది. ఎంపికైన భారత భాగస్వామి డిజైన్, అభివృద్ధి, తయారీ, సమీకరణ, పరీక్షలు, సర్టిఫికేషన్ వంటి అన్ని దశల్లో సహకరించాలి. కంప్రెసర్, కంబస్టర్, టర్బైన్, ఆఫ్టర్బర్నర్, గేర్బాక్స్, ఆయిల్ సిస్టమ్, ఫ్యూయల్ సిస్టమ్ వంటి భాగాల తయారీ, అసెంబ్లీ బాధ్యతలు కూడా ఉంటాయి.
2డీ డ్రాయింగ్స్, 3డీ మోడల్స్, డిజైన్ మార్పులు, ముడిసరుకు కొనుగోలు వంటి పనుల్లో కూడా భాగస్వామ్యం చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం భారతదేశం తన స్వదేశీ యుద్ధవిమానమైన HAL Tejas కోసం కూడా ఇంజిన్లను దిగుమతి చేసుకుంటోంది.
రాబోయే 15-17 సంవత్సరాల్లో 500కి పైగా యుద్ధవిమానాల ఉత్పత్తి లక్ష్యంగా ఉండటంతో, స్వదేశీ ఇంజిన్ లేకపోవడం అభివృద్ధికి పెద్ద అవరోధంగా భావిస్తున్నారు. ఈ పోటీలో ఫ్రాన్స్కు చెందిన Safran, అమెరికాకు చెందిన General Electric, జపాన్కు చెందిన IHI Corporation సంస్థలు కూడా ఉన్నాయి.
ఇప్పటికే కీలక రంగాల్లో ఉన్న రోల్స్ రాయిస్
రోల్స్-రాయిస్ ఇప్పటికే భారత రక్షణ రంగంలో కీలక పాత్ర పోషిస్తోంది. భారత వాయుసేన, నౌకాదళం వినియోగిస్తున్న జాగ్వార్ యుద్ధవిమానాలు, హాక్ ట్రైనర్ విమానాలు, ఆర్మీకి చెందిన అర్జున్ ప్రధాన యుద్ధ ట్యాంకులు, నౌకాదళం, కోస్ట్ గార్డ్కు చెందిన పలు నౌకలు, సబ్మెరైన్లు సహా అనేక వేదికలకు 1,400కు పైగా రోల్స్-రాయిస్ ఇంజిన్లు శక్తినిస్తున్నారు. భారత్లో సంస్థ ఎకోసిస్టమ్లో 4,000 మందికి పైగా పనిచేస్తుండగా, అందులో 2,800 మంది ఇంజినీర్లు ప్రపంచవ్యాప్తంగా సంస్థ ప్రోగ్రామ్లకు సేవలందిస్తున్నారు.
