ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. గతంలో బీఆర్ఎస్ ఆధీనంలో ఉన్న పలు మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటూ జిల్లా రాజకీయాల్లో తన ఆధిపత్యాన్ని స్పష్టంగా చాటుకుంది.
ఖమ్మం జిల్లాలోని ఎదులాపురం, వైరా, మధిర, కల్లూరు, సత్తుపల్లి మున్సిపాలిటీలతో పాటు భద్రాద్రి జిల్లాలోని అశ్వారావుపేట, ఇల్లెందు మున్సిపాలిటీలను కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది. మధిర మున్సిపాలిటీలో మొత్తం 22 వార్డులలో కాంగ్రెస్ 18 స్థానాలు గెలుచుకోగా, టీడీపీ 3, బీఆర్ఎస్ 1 స్థానంతో సరిపెట్టుకుంది.
ఎదులాపురం మున్సిపాలిటీలో మొత్తం 32 వార్డులలో కాంగ్రెస్ 24 స్థానాలు గెలుచుకుంది. బీఆర్ఎస్ 2, సీపీఐ 3, సీపీఎం 2, ఒక స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. వైరా మున్సిపాలిటీలో 20 వార్డులలో కాంగ్రెస్ 12 స్థానాలు గెలుచుకోగా, బీఆర్ఎస్ 5, సీపీఎం 1, సీపీఐ 1, ఒక ఇండిపెండెంట్ గెలిచారు.
కల్లూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 7, ఒక స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. సత్తుపల్లి మున్సిపాలిటీలో మొత్తం 23 వార్డులలో కాంగ్రెస్ 17 స్థానాలు గెలుచుకుని స్పష్టమైన మెజారిటీ సాధించింది. బీఆర్ఎస్ 6 స్థానాలకు పరిమితమైంది.
భద్రాద్రి జిల్లాలోని అశ్వారావుపేట, ఇల్లెందు మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్ ఆధిక్యం సాధించింది.ఇదిలా ఉండగా కొత్తగూడెం కార్పొరేషన్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ పరిస్థితి ఏర్పడింది.
ఒంటరిగా పోటీ చేసిన సీపీఐ 23 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించగా, 9 స్థానాలు గెలుచుకున్న బీఆర్ఎస్ మద్దతుతో మేయర్ పీఠాన్ని దక్కించుకునే పరిస్థితి ఏర్పడింది. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను సీపీఐ, బీఆర్ఎస్ పార్టీలు పంచుకోనున్నట్లు సమాచారం.
మొత్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ దూకుడు ప్రదర్శించగా, కొత్తగూడెంలో మాత్రం సీపీఐ–బీఆర్ఎస్ కూటమి రాజకీయ సమీకరణాలను మార్చింది. జిల్లా రాజకీయాల్లో ఈ ఫలితాలు కీలక చర్చకు దారితీశాయి.
