బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినాన్ని పురస్కరించుకొని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు సోషల్ మీడియా వేదికగా భావోద్వేగపూరితమైన శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ అనే మూడు అక్షరాలు కేవలం పేరు మాత్రమే కాదని, అది జై తెలంగాణ యుద్ధ నినాదమని, దశాబ్దాల ఆకాంక్షల ప్రతిధ్వని అని ఆయన కొనియాడారు.
తెలంగాణ ఆత్మగౌరవ గర్జనగా, ఉద్యమ స్ఫూర్తికి ప్రతిరూపంగా నిలిచిన కేసీఆర్, రాష్ట్ర ప్రజల గుండెల్లో నిత్య సూర్యోదయంలా వెలుగుతున్నారని హరీశ్ రావు పేర్కొన్నారు. యావత్ తెలంగాణను ఏకతాటిపై నడిపించి, ఉద్యమాన్ని సృష్టించి, చివరకు రాష్ట్ర ఆవిర్భావాన్ని సుసాధ్యం చేసిన దృఢసంకల్పం కేసీఆర్ సొంతమని ప్రశంసించారు.
తన వ్యక్తిగత మరియు రాజకీయ ప్రస్థానంలో కేసీఆర్ పాత్రను గుర్తు చేసుకుంటూ హరీశ్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తనకు కేవలం మేనమామ మాత్రమే కాదని, అంతకు మించిన సర్వస్వం అని తెలిపారు. మేనమామగా అపారమైన ప్రేమను అందించడమే కాకుండా, రాజకీయంగా ఓనమాలు దిద్దించి, విలువలతో కూడిన ప్రజా సేవలో తనను తీర్చిదిద్దిన గురువు అని కొనియాడారు.
కేసీఆర్ అడుగులు ఆత్మగౌరవ పోరాటానికి దారి చూపాయని, ఆయన వ్యూహాలు ఆధిపత్య శక్తుల కుట్రలను పటాపంచలు చేశాయని పేర్కొన్నారు. తెలంగాణ విముక్తి కోసం పోరాడిన కేసీఆర్, దేశ చరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయాన్ని లిఖించారని, ఆయన జన్మదినం తెలంగాణ ప్రజలందరికీ ఒక పర్వదినమని సందేశం ఇచ్చారు. కేసీఆర్ నిండు నూరేళ్లు సంపూర్ణ ఆరోగ్యంతో వర్ధిల్లాలని, ఆయన నాయకత్వం మరిన్ని దశాబ్దాల పాటు జాతికి దిశానిర్దేశం చేయాలని భగవంతుడిని ప్రార్థిస్తూ హరీశ్ రావు తన శుభాకాంక్షలు తెలియజేశారు.
