“ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక”లో భాగంగా రూపొందించిన 99 రోజుల యాక్షన్ ప్లాన్ అమలుకు సంబంధించిన సన్నాహక సమావేశం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసులు, పాడి పరిశ్రమాభివృద్ధి, పశుసంవర్ధక మరియు మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి ఈ సమావేశంలో పాల్గొని కార్యాచరణపై చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామం నుంచి మండలం, నియోజకవర్గం, జిల్లా స్థాయి వరకు 99 రోజుల యాక్షన్ ప్లాన్ను సమర్థంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం ఎంత మంచి ప్రణాళిక రూపొందించినా, దాని అమలులో అధికారుల సహకారం ఎంతో అవసరమని ఆయన అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కష్టంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను నిరంతరం అమలు చేస్తోందని పేర్కొన్నారు.
సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారుని గడపకు చేరేలా చేయడం అధికారుల ద్వారానే సాధ్యమవుతుందని మంత్రి తెలిపారు. ఎలాంటి భేషజాలకు పోకుండా ప్రజాప్రతినిధులు, ప్రతిపక్షాలు, అధికారులు ఇచ్చే సూచనలు స్వీకరిస్తామని చెప్పారు. ఒకవేళ పథకాలు అర్హులకు చేరకపోతే దానికి కారణాలను గుర్తించి పరిష్కరించాలని సూచించారు.
ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి అధికారులు గ్రామాలకు వెళ్లి ప్రత్యక్షంగా విచారణ చేసి వాటిని వేగంగా పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ కార్యక్రమాలు ఆలస్యం కాకుండా నిర్ణయించిన గడువులోనే పనులు పూర్తి చేయాలని చెప్పారు. గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
99 రోజుల వ్యవధిలో ప్రతి గ్రామం, మండలం, నియోజకవర్గంలో రోడ్లు, తాగునీరు, శానిటేషన్, విద్య, వైద్యం, ఆరోగ్యం, పశుసంవర్ధకం, క్రీడలు తదితర రంగాల్లో స్పష్టమైన మార్పు కనిపించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి క్రీడల్లో పాల్గొనేలా “మత్తు వదలండి – మైదానాలు చేరండి” అనే సందేశాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.
ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, త్వరలో దానిపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. విద్యార్థుల్లో క్రీడల పట్ల అవగాహన పెంచి గ్రామీణ క్రీడాకారులను గుర్తించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ప్రోత్సహించాలని అన్నారు.
హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో మార్చి 8 నుంచి ప్రతిష్టాత్మక FIH Women’s Hockey Olympic Qualifier 2026 టోర్నమెంట్కు ఆతిథ్యం ఇస్తున్నామని తెలిపారు. అలాగే క్రీడల్లో గాయపడిన క్రీడాకారుల కోసం గచ్చిబౌలిలో ఆధునాతన హాస్పిటల్ నిర్మించనున్నట్లు ప్రకటించారు.
ప్రభుత్వం వరి రైతులకు బోనస్ ఇచ్చి సన్న బియ్యాన్ని కొనుగోలు చేసి రేషన్ దుకాణాల ద్వారా పేదలకు అందిస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు, పెట్రోల్ బంకుల నిర్వహణ, అద్దె బస్సుల నిర్వహణ వంటి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఎమ్మెల్యేలు కూనమనేని సాంబశివరావు, రామదాస్ నాయక్, తెల్లం వెంకటరావు, కోరం కనకయ్య, ఎమ్మెల్సీ తాత మధు, అనుదీప్ దురిశెట్టి, జితేష్ వి పాటిల్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
