ఇరాన్ యుద్ధ నౌకకు భారత్ ఆశ్రయం కల్పించిందా? IRIS Dena అనే ఇరాన్ యుద్ధ నౌకను అమెరికాకు చెందిన జలాంతర్గామి శ్రీలంక తీర ప్రాంతంలో బాంబులతో దాడి చేసి ముంచివేసిన విషయంపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతున్న వేళ తాజాగా ఈ ప్రశ్న వినిపిస్తున్నది. మార్చి 4న మరో ఇరాన్ యుద్ధనౌక ఐఆర్ఐఎస్ డెనా (IRIS Dena) ను అమెరికా సబ్మరిన్ శ్రీలంక తీరానికి సమీపంలోని అంతర్జాతీయ జలాల్లో ముంచివేసింది.
ఈ ఘటనలో 87 మంది ఇరాన్ నావికాదళ సైనికులు చనిపోగా 32 మందిని శ్రీలంక కాపాడింది. అంతర్జాతీయ జలాల్లో ఎలాంటి హెచ్చరిక లేకుండా ఇరాన్ నౌకపై దాడి చేయడం సముద్రంలో జరిగిన దారుణమని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరఘ్చీ పేర్కొన్నారు. ఇరాన్ తీరానికి దాదాపు 2000 మైళ్ల దూరంలో ఈ దాడి జరిగిందని చెప్పారు. ఈ చర్యకు అమెరికా తీవ్రమైన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. విశాఖపట్నంలో జరిగిన అంతర్జాతీయ నావికాదళ ప్రదర్శనకు వచ్చిన మరో ఇరాన్ యుద్ధ నౌక ఐఆర్ఐఎస్ లావన్ (IRIS Lavan). ఈ యుద్ధ నౌక విశాఖపట్నం నుంచి తిరిగి వెళుతున్న సమయంలో దానికి సాంకేతికపరమైన సమస్యలు వచ్చాయి. దాంతో IRIS Lavan కు భారత్ లో నిలుపుదల చేసేందుకు ఇరాన్ కోరింది.
ఫిబ్రవరి 28న ఇరాన్ భారత్ కు ఈ మేరకు విజ్ఞప్తి చేయగా మార్చి 4న భారత్ అందుకు అనుమతించింది. ఆ నౌకకు సాంకేతిక సమస్యలు తలెత్తినందున అత్యవసరంగా పోర్టులో నిలిపే అవసరం ఉందని తెలిపింది. ఈ అభ్యర్థనను పరిశీలించిన భారత్ మార్చి 1న కోచి పోర్టులో నౌకను నిలిపేందుకు అనుమతి ఇచ్చింది. తర్వాత ఆ యుద్ధనౌక మార్చి 4న కేరళలోని కోచికి చేరుకుంది.
ఆ నౌకలో ఉన్న 183 మంది సిబ్బందిని ప్రస్తుతం కోచిలోని నౌకాదళ సదుపాయాల్లో ఉంచినట్లు వర్గాలు తెలిపాయి. భారత్ ఆశ్రయం కల్పించేందుకు నిరాకరించి ఉన్నట్లయితే IRIS Lavanను కూడా అమెరికా లేపేసి ఉండేది. తమ సైనికులను కాపాడిన భారత్ కు ఇరాన్ కృతజ్ఞతలు తెలిపిఉంటుంది.
