రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణను జిల్లాల్లో సమర్థవంతంగా అమలు చేయాలని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ పనులను వేగవంతం చేయాలని, భూ సేకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, మరమ్మతులు ఏమైనా ఉంటే వెంటనే యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందించాలని ఆదేశించారు. వేసవి కాలంలో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.
సీఎంఆర్ వ్యవహారంలో మిల్లర్ల నుంచి ధాన్యం రికవరీ, కేసుల పురోగతి, వంటి అంశాలపై ఏప్రిల్ 30 నాటికి సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించారు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జాబితాను ఆధార్, బ్యాంక్ ఖాతాలకు అనుసంధించాలని, ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలని, ఇసుక అక్రమ రవాణా, మైనింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు.
పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేలా చూడాలని, విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక, అమలుకు సాంకేతికతను వినియోగించుకోవాలని స్పష్టం చేశారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను 10-15 రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించారు.
కొంతమంది అధికారులు తమ పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు నిరాసక్తతను ప్రదర్శిస్తున్నారని, వాటిని ఉన్నతాధికారులకు నివేదిస్తున్నారని, దీంతో తీవ్ర జాప్యం జరుగుతుందని ఆయన అన్నారు. దీంతో బాధితులకు సకాలంలో సాంత్వన లభించడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.
సంక్షేమ పథకాలతో పాటు కుల, నివాస, ఇతర అర్జీలను సకాలంలో ఆన్ లైన్ లో అందేలా చూడాలని చెప్పారు. బాసర సరస్వతీ ఆలయంలో అన్ని సేవలను ఆన్ లైన్ లో అందుబాటులోకి తేవాలని తెలిపారు. బాసర ట్రిపుల్ ఐటిలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
