నెల్లూరు జిల్లా ఆత్మకూరు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. జనసేన పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమనడంతో నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సభ్యత్వ నమోదు కార్యక్రమం సాక్షిగా పార్టీలోని రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే ఆత్మకూరు నియోజకవర్గ ఇన్చార్జ్ నలిశెట్టి శ్రీధర్కు కనీసం సమాచారం లేకుండానే, చదలవాడ హరీష్ కుమార్ వర్గం పట్టణంలో సభ్యత్వ నమోదు సభను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే, తమ నాయకుడికి సమాచారం ఇవ్వకుండా కార్యక్రమం ఎలా నిర్వహిస్తారంటూ నలిశెట్టి శ్రీధర్ అనుచరులు అక్కడికి చేరుకుని సభను అడ్డుకున్నారు.
ఈ క్రమంలో హరీష్ కుమార్, నలిశెట్టి శ్రీధర్ వర్గాల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. అది కాస్తా ముదిరి ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు భౌతిక దాడులకు దిగారు. ఈ తోపులాటలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి.
పరిస్థితి విషమించడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను సముదాయించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ శ్రీధర్ వర్గీయులు శాంతించకుండా టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. “గో బ్యాక్ అజయ్ కుమార్” అంటూ ప్లకార్డులతో నిరసన తెలపడంతో ఆత్మకూరులో రాజకీయ వాతావరణం ఉద్రిక్తంగా మారింది.
