తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ నుంచి వేం నరేందర్ రెడ్డి కొత్తగా రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా నూతన ఎంపీ వేం నరేందర్ రెడ్డితో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఖర్గే ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సమావేశంలో ఎంపీలు మల్లు రవి, సురేష్ షెట్కర్, బలరాం నాయక్ కూడా పాల్గొన్నారు. ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, పార్టీ బలోపేతంపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలను ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు ఖర్గేకు వివరించారు.
