భారీగా శబ్దాలు, దట్టమైన పొగలతో సైలెన్సర్లు వాడిచే సంబందిత బైక్స్ ను సీజ్ చేస్తామని విజయనగరం జిల్లా ఎస్పీ దామోదర్ మంగళవారం వాహనదారులకు హెచ్చరికలు జారీ చేసారు. నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాలకు అమర్చిన 550 సైలెన్సరులను సీజ్ చేసారు ట్రాపిక్ పోలీసులు.
ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ సమక్షంలోనే నగరంలోని ట్యాంక్ బండ్ వద్ద రోడ్డు రోలరుతో సైలెన్సరులను ట్రాఫిక్ పోలీసులు ధ్వంసం చేసారు.వాహనాల సైలెన్సర్ ను మార్పు చేయడం చట్టరీత్యా నేరమని, చట్టాన్ని ఉల్లంఘిస్తే వాహనాలను సీజ్ చేయడంతోపాటు, వాహనాదారులకు జరిమానా విధిస్తామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.
నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాలకు సైలెన్సరులను అమర్చడం, కంపెనీ ఇచ్చిన సైలెన్సరులను మార్పు చేయడం చట్టరీత్యా నేరమన్నారు. అలాంటి వాహనదారులపై చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవన్నారు. ద్విచక్ర వాహనాలకు సంబంధిత వాహన తయారీ కంపెనీలు ప్రత్యేకంగా డిజైన్ చేసి, సైలెన్సరులను అమరుస్తారని, వీటిని మార్పు చేయడం చట్టరీత్యా నేరమన్నారు.
ఇటీవల కాలంలో యువత తమ ద్విచక్ర వాహనాల సైలెన్సరులను మార్పులు చేస్తూ, పెద్ద శబ్ధాలతో ఇతర వాహనదారులను, ప్రజలు, పాదచారులను, పిల్లలు, హృద్రోగులను భయభ్రాంతులకు గురి చేస్తూ శబ్ద కాలుష్యానికి కారణమవుతున్నారన్నారు.
వీటిని నియంత్రించుటలో భాగంగా గడచిన ఆరు నెలలో ట్రాఫిక్ పోలీసులు పలుమార్లు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి, నిబంధనలకు విరుద్ధంగా అమర్చిన 550 సైలెన్సరులను మెకానిక్ సహకారంతో తొలగించామన్నారు.నిబంధనలకు విరుద్ధంగా సైలెన్సరులను అమర్చినందుకుగాను ఒక్కొక్కరికి రూ.1500/- చొప్పున జరిమానా విధించామన్నారు.
తొలగించిన సైలెన్సరులను మళ్ళీ వాహనదారులు వినియోగించకుండా ఉండేందుకుగాను వీటిని రహదారిపై వేసి, రోడ్డు రోలరుతో ధ్వంసం చేసే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. భవిష్యత్తులో ఇదే తరహా కార్యక్రమాన్ని కొనసాగిస్తామని, ప్రత్యేక డ్రైవులు చేపట్టి, నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాలకు ఉన్న సైలెన్సరులను తొలగిస్తామన్నారు.
అంతేకాకుండా, కొత్త మోటారు వాహన చట్టం ప్రకారం ఈ తరహా సైలన్సరులను అమర్చిన వాహనాలను సీజ్ చేయడంతోపాటు, ఆయా వాహనదారులకు జరిమాన విధిస్తామని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉండే సైలన్సరులును అమ్మే షాపు యజమానులతో, బైక్ మెకానిక్ లతో సమావేశాలు ఏర్పాటు చేసి వారిని హెచ్చరించడం, నోటీసులు ఇవ్వడం కూడా జరిగిందని, ఎవరైనా అతిక్రమిస్తే వారిపై రౌడీ షీట్ తెరిచి నిఘా పెట్జటడం జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో విజయనగరం ఇంచార్జ్ డిఎస్పీ ఆర్.గోవిందరావు, ట్రాఫిక్ సీఐ సూరినాయుడు, ఎస్బీ సిఐ ఎ.వి.లీలారావు, టూటౌన్ సీఐ టి.శ్రీనివాసరావు, వన్ టౌన్ ఎస్ఐ శంభాన రవి,ట్రాపిక్ ఎస్ఐలు ఎస్. భాస్కరరావు, నూకరాజు, చిన్నరావు, హెచ్.సీ సింహాచలం,భాస్కర్ , సిబ్బంది పాల్గొన్నారు.
