భూ దందాల ఆరోపణలపై రాష్ట్ర రాజకీయాల్లో ఉద్రిక్తత నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బీఆర్ఎస్ నేత హరీష్ రావుపై తీవ్ర ఆరోపణలు చేశారు. హరీష్ రావు సోదరుడు మహేశ్వర్ రావుకు సంబంధించిన భూ వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని సీఎం ఆరోపించారు.
తాను మంత్రిగా ఉన్న సమయంలో హరీష్ రావు కుటుంబ సభ్యులు తమ్ముడు మహేశ్వర్ రావు, మామ హనుమంత్ రావు, బావమరిది సుమన్ రావు ధరణి వ్యవస్థను అడ్డుపెట్టుకొని భూముల బదలాయింపులకు పాల్పడ్డారని రేవంత్ రెడ్డి విమర్శించారు. మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ ప్రాంతంలో ప్రైవేటు పరిశ్రమ యజమానులను బెదిరించి వందల ఎకరాల భూములను తమ పేర్లకు మార్చుకున్నారని ఆరోపించారు.
ఈ అంశంపై ధైర్యం ఉంటే హరీష్ రావు ముందుకు వచ్చి నిజాలను ఒప్పుకోవాలని సీఎం సవాల్ విసిరారు. ఈ వ్యవహారంపై హౌస్ కమిటీ ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. హరీష్ రావు నిజాయితీపై విశ్వాసం ఉంటే కేటీఆర్, వెంకటరమణా రెడ్డి హౌస్ కమిటీకి అంగీకరించాలని సూచించారు.
అసెంబ్లీలో ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సభలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
