కల్తీ నెయ్యి కేసులో సుప్రీం కోర్టు నియమించిన సిట్ ఛార్జిషీట్ దాఖలు చేసింది మొదలు.. ఏపీ రాజకీయాలు హీటెక్కాయి. డైవర్షన్ పాలిటిక్స్ ఊపందుకొన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. కూటమి ప్రభుత్వంలోని ఇతర మంత్రులు.. నాయకులు లడ్డు కల్తీని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు.
మరోవైపు ఈ టాపిక్ నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి అనేక వివాదాలను తెరపైకి తీసుకొచ్చిన వైసీపీ.. అవేవీ వర్కౌట్ కాకపోవడంతో.. ఏకంగా సీఎం చంద్రబాబునే బూతులు తిట్టించారు. ఎవరు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారో చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యాలు అవసరం లేదు. కానీ మాజీ మంత్రి, వైసీపీ నేత ఆర్కే రోజా మాత్రం రివర్స్లో ఆరోపణలు చేస్తున్నారు.
కల్తీ నెయ్యి టాపిక్ నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే అంబటి రాంబాబు, జోగి రమేశ్లపై కేసులు పెట్టారని వాదిస్తున్నారు. అంబటి రాంబాబే బాధితుడు అని చెప్పే ప్రయత్నం చేశారు. ఇంత మాట్లాడిన రోజాకి.. సీఎంని బూతులు తిట్టడం మంచిది కాదు అని చెప్పడానికి మాత్రం నోరు రాలేదు. ఆమె తీరు వాళ్ల పార్టీ సంస్కృతికి.. వైసీపీ నాయకుల మనస్తత్వానికి అద్దం పడుతోంది.
నెయ్యి కల్తీ మీద చర్చ జరగాలని కూటమి ప్రభుత్వం కోరుకొంటోంది. ఈ టాపిక్ నుంచి తప్పించుకోవడానికి వైసీపీ ప్రయత్నిస్తోంది. ఇక్కడే ఎవరు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారో క్లారిటీ వచ్చేసింది. జగన్ బాబాయ్ వివేకానందరెడ్డి హత్య జరిగిన సమయంలో.. మొదట సాక్షి ఛానల్లో ఆయన గుండెపోటుతో మరణించారని ప్రచారం చేశారు. తర్వాత అది హత్యగా తేలడంతో.. అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు మీదకు నెట్టేసే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే.
పవిత్రమైన శ్రీనివాసుడి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వ్యవహారంలోనూ.. తప్పంత వైసీపీ నేతలదే అని సీబీఐ సిట్ స్పష్టంగా చెప్పినా.. కూటమి ప్రభుత్వమే తప్పు చేసిందని ఎదురుదాడికి దిగుతున్నారు. ఎంత అడ్డంగా వాదించినా అబద్దాలు నిజాలైపోవు.. కెమికల్ విషం స్వచ్చమైన ఆవు నెయ్యిగా మారదు.
అలాగే ఘోరంగా ఓడిపోయి.. 11 సీట్లకే పరిమితం అయినా.. వైసీపీ నేతల తీరూ మారలేదు. వీళ్లు మారాలంటే.. ప్రజలే నేరుగా రంగంలోకి దిగాలేమో.
