వైసీపీ నేతలను హిందూ వ్యతిరేక ముద్ర గట్టిగా వెంటాడుతోంది. ఈ ట్యాగ్ను ఎలాగైనా వదిలించుకోవాలని పార్టీ అధినేత జగన్ నుంచి ఇటు కిందిస్థాయి నేతల వరకు ఇప్పుడు హిందూ దేవాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తమపై ఉన్న మచ్చను చెరిపేసుకునేందుకు రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తాజాగా ఆసక్తికరమైన కార్యక్రమం చేపట్టారు.
తిరుపతిలోని తన నివాసంలో ముస్లిం దంపతులకు హిందూ మత పున:స్వీకరణ చేయించి, స్వయంగా హోమ గుండం ముందు కూర్చుని సరికొత్త అవతారం ఎత్తారు భూమన. పీకే లేఅవుట్కు చెందిన అబ్దుల్లా, అమీనా దంపతులను.. శ్రీనివాసులు రెడ్డి, పుష్పలుగా మారుస్తూ ఆయన చేసిన ఈ ఘర్ వాపసీ ప్రయత్నం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
అయితే, భూమన చేసిన ఈ ప్రయత్నాలపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ముఖ్యంగా మాజీ ఐపీఎస్ అధికారి ఎం. నాగేశ్వర రావు ఈ ఉదంతంపై స్పందిస్తూ బాంబు పేల్చారు. భూమనా.. ఈ సామాన్య దంపతులను హిందువులుగా మార్చినందుకు అభినందనలు. కానీ, మీ అసలు పరీక్ష ఇక్కడ కాదంటూ ఎద్దేవా చేశారు.
హిందూ వ్యతిరేక ముద్రను నిజంగానే తొలగించుకోవాలనే పట్టుదల భూమనకు ఉంటే.. కేవలం సామాన్యులతో సరిపెట్టకూడదని నాగేశ్వర రావు వ్యాఖ్యానించారు. సాక్షాత్తూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని, ఆయన కుటుంబాన్ని సకుటుంబంగా తిరిగి హిందూ మతంలోకి తీసుకురావడానికి భూమన తన శాయశక్తులా ప్రయత్నించాలంటూ సంచలన కామెంట్ చేశారు.
ఈ ఒక్క మార్పు జరిగితే అటు రాష్ట్రానికి, ఇటు ధర్మానికి, అటు జగన్ కుటుంబానికి.. చివరికి ఆ పుణ్యకార్యం చేసిన భూమనకు కూడా ఎంతో మేలు జరుగుతుందని నాగేశ్వర రావు చమత్కరించారు. గతంలో టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు అన్యమత ప్రచారానికి ఊతమిచ్చారన్న విమర్శలు ఎదుర్కొన్న భూమన.. ఇప్పుడు ఆ పాపప్రక్షాళన కోసమే ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారా..? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో విన్పిస్తున్నాయి.
