అమరావతి నిర్మాణ వ్యయంపై గత కొద్దిరోజులుగా వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారంపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి నారాయణ. వైసీపీ చేస్తున్న ఆరోపణలు కేవలం ప్రజల్లో గందరగోళం సృష్టించే కుట్రని, వాస్తవ లెక్కలు అందుకు భిన్నంగా ఉన్నాయని ఆధారాలతో సహా నిరూపించారు. అమరావతి నిర్మాణ వ్యయాన్ని దేశ రాజధాని ఢిల్లీలోని సెంట్రల్ విస్టా, తెలంగాణ సచివాలయ నిర్మాణ ఖర్చులతో పోల్చి విశ్లేషించారు.
అమరావతిలో చదరపు అడుగుకి రూ. 14,000 ఖర్చవుతోందని వైసీపీ చేస్తున్న ప్రచారం పచ్చి అబద్ధమన్నారు మంత్రి. నిజానికి తెలంగాణ సచివాలయానికే రూ. 13,000 పైగా ఖర్చయిందని, ఢిల్లీ పార్లమెంట్ భవన సముదాయానికి రూ. 16,000 వరకు వ్యయమైందన్నారు. ఇంటర్నేషల్ స్టాండర్డ్స్తో నిర్మిస్తున్న అమరావతికి ఈ ఖర్చు ఏమాత్రం ఎక్కువ కాదని, వైసీపీ పాలనలో పనులు నిలిపివేయడం వల్లే స్టీల్, సిమెంట్ ధరలు 40 నుండి 80 శాతం వరకు పెరిగాయని, ఈ అదనపు భారం వైసీపీ నిర్వాకమేనని మండిపడ్డారు.
మాజీ సీఎం జగన్ తన విలాసాల కోసం విశాఖ రుషికొండపై నిర్మించుకున్న ప్యాలెస్ ఖర్చును నారాయణ ప్రస్తావించారు. అక్కడ చదరపు అడుగుకి ఏకంగా రూ. 35,714 వెచ్చించారని, ప్రజా రాజధానిపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదని విమర్శించారు. అమరావతిలో నిర్మిస్తున్నవి కేవలం ఆఫీసులు మాత్రమే కాదని, రాబోయే తరాల కోసం నిర్మిస్తున్న ఐకానిక్ కట్టడాలని ఆయన స్పష్టం చేశారు.
ఇక అమరావతిలో ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారుల నివాస భవనాలు 90 శాతం పూర్తయ్యాయని, మే చివరి నాటికి అవి సిద్ధమవుతాయని మంత్రి ప్రకటించారు. 2027 నాటికి ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, 2028 నాటికి ఐకానిక్ టవర్లను పూర్తి చేస్తామన్నారు. అభివృద్ధిని అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే వైసీపీ తప్పుడు లెక్కలను తెరపైకి తెచ్చిందన్నారు.
