రాజధానిలోని రెడ్ఫోర్ట్ మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన ఘోర పేలుడులో 12 మంది మృతి చెందగా, పలువురు గాయపడిన నేపథ్యంలో దర్యాప్తు వేగం పెరిగింది. ఈ ఘటనలో జైష్ ఎ మోహమ్మద్ ఉగ్రసంస్థ అనుబంధాలు వెలుగులోకి రావడంతో, ప్రభుత్వం అల్ ఫలాహ్ యూనివర్సిటీ నిధులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ఆదేశించింది.
అల్ ఫలాహ్ యూనివర్సిటీకి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలను పరిశీలించేందుకు ఆర్థిక నేర విభాగం (EOW)కూ ప్రభుత్వం దిశానిర్దేశాలు జారీ చేసింది. యూనివర్సిటీ ఖాతాలను ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలని ఆదేశించగా, నిధుల వనరులు, లావాదేవీలలో ఏవైనా అనుమానాస్పద అంశాలున్నాయా అని అధికారులు విచారణ ప్రారంభించారు.
ఇప్పటికే ఢిల్లీలో జరిగిన పేలుడుపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) విచారణ కొనసాగిస్తుండగా, ఇప్పుడు ఈడీ, ఈఓడబ్ల్యూ కూడా సంయుక్తంగా దర్యాప్తులో పాల్గొననున్నాయి. అల్ ఫలాహ్ యూనివర్సిటీకి విదేశీ నిధులు లేదా ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయా అనే అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారని సమాచారం.
ప్రాథమిక నివేదికల ప్రకారం, పేలుడు ఘటనకు సంబంధించిన కొన్ని ఆర్థిక లావాదేవీలు యూనివర్సిటీ ఖాతాలకు అనుబంధంగా ఉన్నాయని దర్యాప్తు సంస్థలు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, సంబంధిత వ్యక్తుల బ్యాంక్ రికార్డులు, ఫండ్ ట్రాన్స్ఫర్ వివరాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. దర్యాప్తు సంస్థలు సంయుక్తంగా నివేదిక సమర్పించనున్నట్లు, దానిపై ఆధారపడి ప్రభుత్వం తదుపరి చర్యలు చేపట్టనుందని అధికార వర్గాలు వెల్లడించాయి.
