ప్రజల ప్రాణాల పరిరక్షణలో ఎప్పుడూ ముందుండే 2టౌన్ పోలీసుల మానవత్వానికి నిదర్శనంగా నిలిచిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. పల్నాడు జిల్లా నరసరావుపేట శివారులోని ఓ ఇంట్లో కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది.
పరిస్థితి విషమంగా మారుతున్న సమయంలో, ఆమె భర్త వెంటనే 2టౌన్ సిఐ ప్రభాకర్కు ఫోన్ చేసి తన భార్యను కాపాడాలని ఆర్తిగా వేడుకున్నాడు. సమాచారం అందుకున్న వెంటనే సిఐ ప్రభాకర్ ఎలాంటి ఆలస్యం చేయకుండా స్పందించి, హెడ్ కానిస్టేబుల్ కరిముల్లాను సంఘటనా స్థలానికి పంపించారు.
అక్కడికి చేరుకున్న కరిముల్లా పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందని గుర్తించి, తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించి మహిళను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ ఘటనలో 2టౌన్ పోలీసుల అప్రమత్తత, వేగవంతమైన స్పందన, మానవత్వం కలిసి ఒక అమూల్యమైన ప్రాణాన్ని కాపాడాయి.
తమ పరిధి కాదన్న భావన లేకుండా కేవలం ప్రాణరక్షణే లక్ష్యంగా పనిచేసిన సిఐ ప్రభాకర్, హెడ్ కానిస్టేబుల్ కరిముల్లా సేవలను స్థానిక ప్రజలు హర్షిస్తూ అభినందిస్తున్నారు.
