కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చెందుర్తి గ్రామంలోని జట్ల చెరువు మట్టి మాఫియాకు అడ్డాగా మారింది. చేబ్రోలులోని జనసేన పార్టీ కార్యాలయం వెనుక నుంచే యథేచ్ఛగా మట్టి తరలింపు జరుగుతుండటం స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ అక్రమ రవాణా వెనుక జనసేన పార్టీకి చెందిన కొందరు నేతల హస్తం ఉందని, వారి సహకారంతోనే చెరువును దోచుకుంటున్నారని గ్రామస్తులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు.
గత రెండు రోజులుగా భారీ ఎత్తున మట్టి తరలిపోతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రజలు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అధికారుల మౌనం వెనుక ఉన్న ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చెరువులను అభివృద్ధి చేసి పంచాయతీలకు ఆదాయ వనరులుగా మార్చాలని ప్రయత్నిస్తుంటే, సొంత పార్టీ నాయకులే ప్రభుత్వ ఆశయాలకు గండికొట్టడం దారుణమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ వ్యవహారంపై జనసేన పార్టీ ‘ఫైవ్ మేన్ కమిటీ’ తక్షణమే స్పందించాలని, అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ సంపదను కొల్లగొడుతున్న వారిపై ఉన్నతాధికారులు విచారణ జరిపి, ఈ మట్టి దోపిడీని వెంటనే అరికట్టాలని కోరుతున్నారు.
