మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీపీఆర్వో మరియు వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై సామాజిక మాధ్యమాల వేదికగా వ్యక్తిత్వ హననానికి పాల్పడటమే కాకుండా, అభ్యంతరకరమైన పోస్టింగ్లు పెట్టించినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి ఉన్నట్లుగా రూపొందించిన యానిమేషన్ చిత్రాలను సోషల్ మీడియాలో వైరల్ చేసిన వ్యవహారంపై చిత్తూరులో కేసు నమోదైంది.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు శ్రీహరిని అదుపులోకి తీసుకుని, ఆయన వద్ద ఉన్న సెల్ ఫోన్ మరియు ల్యాప్ ట్యాప్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాజిక మాధ్యమ విభాగాన్ని సమన్వయం చేస్తూ ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాన్ని ప్రోత్సహిస్తున్నారనే కోణంలో పోలీసులు ఆయనను విచారిస్తున్నారు.
రాజకీయ కక్షసాధింపులో భాగంగానే ఈ అరెస్టులు జరుగుతున్నాయని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తుండగా, నిబంధనలకు విరుద్ధంగా అసత్య ప్రచారాలు చేసే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
