ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిపై అత్యంత దారుణమైన పోస్టులు పెట్టిన మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సీపీఆర్వో పూడి శ్రీహరికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. సీఎం నారా చంద్రబాబు నాయుడుపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టినట్లు నమోదైన కేసులో రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై స్టే విధించేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది.
చంద్రబాబుపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు, అభ్యంతరకర చిత్రాలను పోస్ట్ చేశారనే ఆరోపణలు పూడి శ్రీహరిపై ఉన్నాయి. చంద్రబాబు చేతిలో కత్తి పట్టుకుని ఉన్నట్లు యానిమేషన్ చిత్రాలను సృష్టించి, వాటిని వైరల్ చేశారని టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం పోలీసులు ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఏప్రిల్ 1వ తేదీన తాడేపల్లిలోని శ్రీహరిని తన నివాసం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఆయన ల్యాప్టాప్, మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు నిబంధనలు పాటించకుండా అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని శ్రీహరి తరఫున హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది. అయితే ఊహించని విధంగా శ్రీహరి రిమాండ్ను ట్రయల్ కోర్టు నిరాకరించింది.
పోలీసులు దీనిని హైకోర్టులో సవాలు చేశారు. హైకోర్టు కుప్పం కోర్టు రిమాండ్ నిరాకరణపై స్టే విధించింది. తనపై జరుగుతున్నది రాజకీయ కక్షసాధింపు అని, తన ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని పేర్కొంటూ పూడి శ్రీహరి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ విచారణలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసుపై రేపు (బుధవారం) హైకోర్టులో విచారణ జరగాల్సి ఉన్నందున, పూడి శ్రీహరి, మరో నిందితుడు గిరీశ్ కుమార్ రెడ్డిలకు ఎలాంటి మధ్యంతర రక్షణ కల్పించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన ధర్మాసనం, తదుపరి విచారణను వేసవి సెలవుల వెకేషన్ బెంచ్ ముందుకు వాయిదా వేసింది.
