ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో గత మూడు రోజులుగా (జులై 27, 28, 29) అత్యంత వైభవంగా జరుగుతున్న “శాకంభరీ ఉత్సవాలు” ఈరోజు (బుధవారం) గురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని మహాపూర్ణాహుతితో ప్రశాంతంగా, ఘనంగా ముగిశాయి.
ఉత్సవాల ముగింపు రోజైన పౌర్ణమి సందర్భంగా శ్రీ అమ్మవారు దివ్యమైన అలంకారంతో వివిధ రకాల పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, డ్రైఫ్రూట్స్తో కూడిన శాకంభరీ దేవి రూపంలో భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు.
ఉత్సవ సమాప్తి సందర్భంగా ఆలయ స్థానాచార్య వి.శివప్రసాద శర్మ, వైదిక కమిటీ సభ్యులు, వేదపండితులు, అర్చకస్వాముల ఆధ్వర్యంలో పవిత్ర వైదిక క్రతువులు జరిగాయి. “మహా పూర్ణాహుతి”, కలశోద్వాసన, మార్జనము మరియు ప్రోక్షణతో ఉత్సవాలు దిగ్విజయంగా సమాప్తమయ్యాయి.
ఈ సందర్భంగా దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ మాట్లాడుతూ “రైతులు మరియు దాతలు ఉదారంగా అందించిన విరాళాలతో మొత్తం45 టన్నుల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు మరియు డ్రైఫ్రూట్స్తో గర్భగుడి, ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణాన్ని మహోన్నతంగా అలంకరించడం జరిగింది. సకాలంలో వర్షాలు కురిసి, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు, రైతాంగం ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో ఈ ఉత్సవం పూర్తి చేశాము” అని తెలిపారు.
మూడు రోజుల పాటు సాగిన ఈ ఉత్సవాలలో సుమారు 2. 5లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారని ఈవో శీనా నాయక్ వివరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థాన యంత్రాంగం నిరంతరం పర్యవేక్షణ చేపట్టింది. ఉత్సవాల సందర్భంగా వచ్చిన కూరగాయలతో తయారు చేసిన పవిత్ర ‘కదంబం’ ప్రసాదాన్ని భక్తులందరికీ ఉచితంగా పంపిణీ చేశారు. అలాగే ఉత్సవాల ముగింపు సందర్భంగా భక్తులు కొండ చుట్టూ నిర్వహించిన గిరి ప్రదక్షిణలో విశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపాకటాక్షాలు పొందారు.
ఈ కార్యక్రమములో ఆలయం ధర్మ కర్తలు,ప్రధాన అర్చకులు, ఏఈఓలు పరిపాలనా సిబ్బంది పాల్గొన్నారు.
