తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుకు విజయ్ కి మార్గం సుగమం అయింది. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ పూర్తి మెజారిటీకి ఇంకా 10 స్థానాలు తక్కువగా ఉండటంతో ప్రభుత్వ ఏర్పాటుపై ఇంత కాలం అనిశ్చితి కొనసాగింది. ఈ నేపథ్యంలో వామపక్ష పార్టీలు, వీసీకే తమ మద్దతుపై తుది నిర్ణయం తీసుకోవడంతో విజయ్ కి మార్గం సుగమం అయింది.
234 సభ్యుల అసెంబ్లీలో టీవీకే 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా నిలిచింది. అయితే మెజారిటీకి అవసరమైన 118 స్థానాలకు ఇంకా 10 సీట్లు అవసరమవుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతును విజయ్కు ప్రకటించింది. డీఎంకే కూటమిలో ఉన్న సీపీఐ, సీపీఎం, వీసీకే పార్టీల నిర్ణయంపై విజయ్ భవితవ్యం ఆధారపడి ఉండటం, వారు నిర్ణయం తీసుకోలేకపోవడంతో ఇంత కాలం ఉత్కంఠ కొనసాగింది. చివరకు ఈ మూడు పార్టీలు అంగీకరించడంతో ఇప్పుడు చిక్కు వీడింది.
ఈ మూడు పార్టీలకు చెరో రెండు స్థానాలు లభించాయి. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు కోరుతూ విజయ్ వీటికి లేఖలు పంపినట్లు సమాచారం. ఈ అంశంపై నిర్ణయం తీసుకునేందుకు వామపక్ష పార్టీలు వేర్వేరుగా కీలక సమావేశాలు నిర్వహించాయి.
సీపీఐ పార్టీ కార్యవర్గ సమావేశంలో టీవీకేకు మద్దతు ఇవ్వడం వల్ల కలిగే లాభనష్టాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పార్టీ సిద్ధాంతాలకు భంగం కలగకుండా, కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని అమలు చేసే హామీ లభిస్తేనే మద్దతుపై ఆలోచన చేసే అవకాశముందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. తమిళనాడు రాష్ట్ర కార్యదర్శి ఎం వీరపాండియన్ నేతృత్వంలో జరిగిన సమావేశం గంటల తరబడి కొనసాగినట్లు సమాచారం.
ఇదే సమయంలో సీపీఎం కూడా ప్రభుత్వ ఏర్పాటుపై విస్తృత చర్చలు జరిపింది. మరోవైపు విసికే అధినేత తొల్ తిరుమావళవన్ పార్టీ ఉన్నతస్థాయి కమిటీతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమై రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించారు.
డీఎంకే అధ్యక్షుడు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్తో ఇటీవల జరిగిన భేటీపై ప్రశ్నించగా, అది కేవలం మైత్రి పక్షాల మధ్య మర్యాదపూర్వక సమావేశమేనని తిరుమావళవన్ స్పష్టం చేశారు. గవర్నర్ విజయ్ను ప్రభుత్వం ఏర్పాటు కోసం ఆహ్వానించకపోవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ చెన్నైలో ఆందోళన చేపట్టింది. తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు సెల్వపెరుంతగైతో పాటు పలువురు నేతలు ఈ నిరసనలో పాల్గొన్నారు.
