హుస్నాబాద్ పట్టణ కేంద్రంలోని ఎల్లమ్మ చెరువు కట్టపై మున్సిపల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని, స్వయంగా యోగాసనాలు వేశారు.
సూర్య నమస్కారాలు చేయడం వల్ల శరీరం ఎంతో దృఢంగా, ఆరోగ్యంగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. సూర్య నమస్కారాలు మానవ శరీరానికి ఎంతో ఉత్తమమైనవని కొనియాడారు. పట్టణ కేంద్రంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు సూర్య నమస్కారాల భంగిమల (స్టాచ్యూస్) ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించి “ఆరోగ్య హుస్నాబాద్ – ఆరోగ్య భారత్” నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. యోగా మాస్టర్ అనిత అందరినీ మోటివేట్ చేస్తూ, ఆసనాలను చక్కగా వేయించడాన్ని అభినందించారు.
యోగా చేయడానికి వయసుతో ఎలాంటి సంబంధం లేదని, ప్రతి ఒక్కరూ యోగాను తమ నిత్య జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. “ఆరోగ్యమే మహాభాగ్యం” అనే నినాదానికి తగ్గట్టుగా హుస్నాబాద్లో జరిగిన ఈ కార్యక్రమం ప్రజల్లో మంచి చైతన్యాన్ని నింపింది.
