మంత్రి నారా లోకేష్పై ప్రముఖ ప్రవచనకర్త, రాష్ట్ర ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు చాగంటి కోటేశ్వర రావు ప్రశంసల వర్షం కురిపించారు. కాకినాడ రూరల్ తిమ్మాపురం ఆకుండి లక్ష్మీ స్మారక గోశాల ప్రాంగణంలో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన భారతీయం దేశభక్తి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, వేదికపైనే నారా లోకేష్ వ్యక్తిత్వం, సమయపాలన, సంస్కారాన్ని ముక్తకంఠంతో కొనియాడారు. ప్రజాప్రతినిధిగా లోకేష్ చూపుతున్న నిబద్ధత, పెద్దల పట్ల ఆయనకున్న గౌరవం అభినందనీయమన్నారు.
ఈ సందర్భంగా చాగంటి కోటేశ్వర రావు మాట్లాడుతూ, నారా లోకేష్తో తనకున్న అనుభవాన్ని సభకు వివరించారు. తాను ఒక్కసారి లోకేష్ను కలవాలని కోరిన వెంటనే ఎలాంటి దాపరికం లేకుండా, నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఆహ్వానించారని చెప్పారు. తన కారును అధికారిక నివాసం లోపలి వరకు ఎలాంటి అడ్డంకులు లేకుండా అనుమతించి ఎంతో గౌరవించారని తెలిపారు. విద్యార్థుల్లో దేశభక్తి, నైతిక విలువలను పెంపొందించడానికి భారతీయం కార్యక్రమాన్ని చేపట్టాలని భావించి, రోజంతా తమతో ఉండగలరా అని అడగ్గా లోకేష్ ఏమాత్రం తడబడకుండా గురువు గారు నేను వచ్చేస్తున్నాను, తేదీ చెప్పండి అని తక్షణమే అధికారులను పిలిచి సమయం కేటాయించారని వెల్లడించారు.
అనుకున్న సమయానికి కంటే ముందే వేదిక వద్దకు చేరుకుని కార్యక్రమాంతం వరకు ఉండటం లోకేష్ పంక్చువాలిటీకి నిదర్శనమని చాగంటి కొనియాడారు. అంతేకాకుండా, కార్యక్రమం ముగిసిన తర్వాత తాను వెళ్తుంటే లోకేష్ స్వయంగా బయటకు వచ్చి, డ్రైవర్ను పిలిచి పెద్దాయనను జాగ్రత్తగా తీసుకెళ్లు అని చెప్పి, కారు వెళ్లిపోయే వరకు అక్కడే నిలబడి సాగనంపారని గుర్తుచేసుకున్నారు. ఎవరినీ పొగడాల్సిన అవసరం తనకు లేదని, ఎక్కడ సంస్కారం, సంస్కృతి ఉంటాయో దాన్ని సమాజం ముందు ఆవిష్కరించడమే తన ధర్మమని స్పష్టం చేశారు.
అనంతరం ప్రసంగించిన మంత్రి నారా లోకేష్, ప్రభుత్వ కృషికి నైతిక విలువలు తోడైతే ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థ దేశంలోనే నెంబర్ వన్గా రూపుదిద్దుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. క్లాస్ రూం నుంచే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మి తాను విద్యాశాఖను ఎంచుకున్నానని తెలిపారు. సాంకేతికతకు భారతీయ విలువలను జోడించి మన విద్యార్థులను ప్రపంచ విజేతలుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని, విద్యార్థులు నైతిక విలువలతో ఎదిగి తల్లిదండ్రులకు, దేశానికి గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షించారు.
