ఆందోల్ నియోజకవర్గంలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంపై ఆందోల్, వట్పల్లి, పుల్కల్, చౌటకూరు మండలాలకు చెందిన బూత్ లెవెల్ ఏజెంట్స్ (BLA)లతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర్ రాజనర్సింహ గారు సంగారెడ్డిలోని తన నివాసంలో అవగాహన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్క పౌరుడు ఓటరుగా నమోదు అయ్యేలా బూత్ లెవెల్ ఏజెంట్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఓటర్ల జాబితాలో ఉన్న తప్పులను గుర్తించి సవరణలు చేపట్టేందుకు కృషి చేయాలని, అర్హులైన ఓటరు కూడా జాబితా నుండి తప్పిపోకుండా చూడాలని అన్నారు.
ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని పేర్కొన్న మంత్రి, ప్రతి ఓటరులో తమ ఓటు హక్కుపై అవగాహన పెంపొందించే దిశగా బూత్ లెవెల్ ఏజెంట్లు పనిచేయాలని కోరారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై ప్రతి ఏజెంట్ పూర్తి అవగాహన కలిగి ఉండాలని, దాని ముఖ్య ఉద్దేశాలను ప్రజలకు వివరించాలని సూచించారు.
ఓటర్ల జాబితా పారదర్శకంగా, ఖచ్చితంగా ఉండేందుకు ఎన్నికల సంఘం చేపడుతున్న SIR కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో బూత్ లెవెల్ ఏజెంట్ల పాత్ర ఎంతో కీలకమని మంత్రి దామోదర్ రాజనర్సింహ పేర్కొన్నారు.
ఈ సమావేశంలో ఆందోల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, బూత్ లెవెల్ ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు.
