ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసేందుకు పశ్చిమ బెంగాల్ సిద్ధం అవుతున్నది. పశ్చిమ బెంగాల్ లో ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభించామని ముఖ్యమంత్రి సువేందు అధికారి వెల్లడించారు. ఉత్తరాఖండ్, అస్సాం, గుజరాత్ రాష్ట్రాలలో ప్రస్తుతం ఉమ్మడి పౌరస్మృతి అమలులో ఉన్నది. ఉత్తరాఖండ్, అస్సాం, గుజరాత్ అనుసరించిన విధానంలోనే యూసీసీ అమలు ప్రక్రియ చేపడతామని సువేందు అధికారి తెలిపారు.
కోల్కతాలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఇందుకోసం పదవీ విరమణ పొందిన న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని, దీనిపై సోమవారం శాసనసభలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. మరోవైపు, తృణమూల్ కాంగ్రెస్ ప్రతిపాదిత యూసీసీ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తామని ప్రకటించింది. ఇది బీజేపీ మతపరమైన రాజకీయ అజెండాలో భాగమని ఆ పార్టీ ఆరోపించింది.
ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోదీ, అమిత్ షా రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే యూసీసీని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే బుజ్జగింపు రాజకీయాలకు ముగింపు పలుకుతామని, తమ ఎన్నికల ప్రణాళికలో కూడా యూసీసీ అమలుకు ప్రాధాన్యం ఇచ్చారు.
