డీఎస్సీలో అక్రమాలు అంటూ వైసీపీ చేస్తున్న తప్పుడు రాజకీయాలు.. బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్లపై దాడి చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఎక్కువ మార్కులు వచ్చిన వారికి కాకుండా.. తక్కువ మార్కుల వచ్చిన వారికి ఉద్యోగాలు ఇచ్చారంటూ.. వైసీపీ మీడియాలో ఫేక్ వార్తలతో ప్రజలను, నిరుద్యోగులను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం వెర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్లు అమలు చేసినప్పుడు.. మెరిట్ కంటే రిజర్వేషన్ రోస్టర్ పాయింట్లకే ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుంది.
ఉదాహరణకు ఓసీ అభ్యర్ధికి వందకు 90 మార్కులు వచ్చినా.. బీసీ లేదా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ అభ్యర్ధుల్లో ఎవరికీ అంతకంటే ఎక్కువ మార్కులు రాని సందర్భంలో.. రిజర్వ్డ్ కేటగిరీలో 80 మార్కులు తెచ్చుకున్న వారికీ ఉద్యోగం వస్తుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలోనూ మహిళల కోటా అభ్యర్ధులకు కేటాయించిన సీట్లలో.. స్త్రీలకు ఇతర అభ్యర్ధుల కంటే ఎక్కువ మార్కులు రాకపోయినా.. తక్కువ మార్కులు వచ్చిన మహిళా అభ్యర్ధులనే ఎంపిక చేస్తారు.
మహిళల కోటా తరహాలోనే స్పోర్ట్స్ కోటాలోనూ వారికి కేటాయించిన పోస్టులను క్రీడాకారులతోనే భర్తీ చేస్తారు. ఇతర అభ్యర్ధుల కంటే తక్కువ మార్కులు వచ్చినా కూడా స్పోర్ట్స్ కోటా రోస్టర్ పాయింట్ల ఆధారంగా వారిని ఎంపిక చేస్తారు. డీఎస్సీ ప్రక్రియను పక్కాగా రూల్స్ ప్రకారం, పారదర్శకంగా నిర్వహించామని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ వివరణ ఇచ్చారు. సుప్రీం కోర్టు ఆదేశాల కారణంగా వివిధ రిజర్వేషన్ కేటగిరీల్లో స్థిరమైన రోస్టర్ పాయింట్ని ముందే నిర్ణయిచడం కుదరదని.. వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్ల అమలులో సంక్లిష్టతను అర్ధం చేసుకోలేకపోవడం వల్లనే కొంత మంది విమర్శలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు.
ప్రభుత్వ ఉద్యోగుల నియామక ప్రక్రియలో ఏ చిన్న తప్పు జరిగినా.. అభ్యర్ధులు కోర్టులో న్యాయం పోరాటం చేయొచ్చు. డీఎస్సీలో ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి.. ఏ కేటగిరిలో.. ఏ అంశాల కారణంగా వారిని ఎంపిక చేశారనే విషయాలు పబ్లిగ్గానే అందుబాటులో ఉన్నాయి. వీటిపై సందేహాలుంటే కోర్టులో సవాలు చేయొచ్చు. డీఎస్సీ అభ్యర్ధులకు న్యాయ సహాయం అందిస్తామని చెబుతున్న వైసీపీ.. కోర్టులకు వెళ్లకుండానే సొంత మీడియాలో అక్రమాలు జరిగాయని తీర్పులివ్వడం.. నిరుద్యోగులతో పాటు రాష్ట్ర ప్రజలందరినీ మోసగించడమేనని అధికార పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.
జగన్ హయాంలో గ్రూప్ వన్ నియామక ప్రక్రియలో.. పేపర్ వాల్యుయేషన్ని ఆన్లైన్, ఆఫ్లైన్ అంటూ మూడుసార్లు మార్చి మార్చి నిర్వహించి.. గందరగోళం చేసిన విషయాన్ని ప్రజలు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. గ్రూప్ వన్ పరీక్షను సక్రమంగా నిర్వహించలేని వైసీపీ… అత్యంత పారదర్శకంగా జరిగిన డీఎస్సీ నియామక ప్రక్రియపై ఆరోపణలు చేయడం వెనుక ప్రభుత్వంపై బురద జల్లే కుట్ర ఉందని అధికార పార్టీ నేతలు విమర్శిస్తున్నారు.
